కేంద్ర బడ్జెట్ 2025లో వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పులపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ రూ. 12 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తించదని, మీ ఆదాయంలో ఒక నిర్దిష్ట భాగం ఉంటే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే వార్షిక బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో మరోసారి రూ.12 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపు అంశం తెరపైకి వచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
రూ. 12 లక్షల ఆదాయం - అసలు లెక్క ఏమిటి?
సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన కొత్త మార్పుల ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ ఇతర మినహాయింపులతో కలిపి రూ. 12 లక్షల వరకు పన్ను ఉండదు. కానీ, ఇక్కడ ఒక ముఖ్యమైన మెలిక ఉంది. మీ మొత్తం ఆదాయం కేవలం జీతం ద్వారా మాత్రమే వస్తే ఈ మినహాయింపులు పూర్తిగా వర్తిస్తాయి. ఒకవేళ మీ ఆదాయంలో ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కలిస్తే పన్ను భారం మారుతుంది.
మీ రూ. 12 లక్షల ఆదాయంలో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ, డివిడెండ్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే అది పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. రూ. 75,000 ల స్టాండర్డ్ డిడక్షన్ కేవలం జీతం తీసుకునే వారికి, పెన్షనర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయానికి ఈ మినహాయింపు ఉండదు. రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ కూడా కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. మీ ఆదాయం ఒక పరిమితి దాటితే ఈ రిబేట్ లభించదు, తద్వారా మీరు పన్ను చెల్లించాల్సి వస్తుంది.
చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ మొత్తం ఆదాయం (జీతం + వడ్డీ) రూ. 12 లక్షల లోపే ఉంది కాబట్టి పన్ను సున్నా అని భావిస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీతం కాని ఇతర ఆదాయ మార్గాలు ఉన్నప్పుడు పన్ను లెక్కింపు మారుతుంది. దీనివల్ల పన్ను మినహాయింపు పరిమితి రూ. 12 లక్షల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ శాలరీ ఆదాయం రూ.9 లక్షలు, మూలధన లాభాలు రూ.3 లక్షలు ఉన్నాయనుకుందాం. అప్పుడు మీ ఆదాయం రూ.12 లక్షలే అవుతుంది. దీంతో మీరు పన్ను మినహాయింపు వస్తుందని భావిస్తారు. కానీ, రూ.3 లక్షల ఇతర ఆదాయాలపై ట్యాక్స్ కట్టాల్సిందేనని తెలుసుకోవాలి. అప్పుడు రూ.9 లక్షల వరకే పన్ను శ్లాబులను బట్టి మినహాయింపు లభిస్తుంది.
బడ్జెట్ 2025 నిబంధనల ప్రకారం, పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసే ముందు మీ ఆదాయం ఏ మార్గాల ద్వారా వస్తుందో స్పష్టంగా తెలుసుకోవాలి. కేవలం జీతం మీద ఆధారపడే వారికి ఈ రూ. 12 లక్షల మినహాయింపు పూర్తి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, కానీ అదనపు ఆదాయ వనరులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక నిపుణుల సాయం తీసుకుని తమకు ఎంత పన్ను మినహాయింపు ఉంటుంది, ఇంకా ఎంత పన్ను చెల్లించాలి? అనేది తెలుసుకుని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల్లో స్పష్టంగా పేర్కొనాలి. లేదంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయి. ఇతర వనరుల ఆదాయంపై ట్యాక్స్ కట్టడమే కాకుండా పెనాల్టీలు, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa