చెన్నైలోని టీ నగర్ లో రోడ్లు శుభ్రం చేస్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలికి చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగలు దొరికాయి. వెంటనే ఆమె ఆ నగల బ్యాగును తీసుకెళ్లి సమీపంలోని పోలీస్ స్టేషన్ లో అప్పగించి, వాటిని పోగొట్టుకున్న వారికి అందజేయాలని కోరింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం ఎంకే స్టాలిన్.. సదరు కార్మికురాలిని తన ఆఫీసుకు పిలిపించుకుని సత్కరించారు. ఆమె నిజాయతీని మెచ్చుకుంటూ రూ.లక్ష బహుమతిగా అందించారు. వివరాల్లోకి వెళితే..గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (45) ఆదివారం ఎప్పటిలాగే విధుల్లో నిమగ్నమైంది. టీ నగర్ లోని ముపాతు అమ్మన్ కోయిల్ వీధిలో రోడ్లను శుభ్రం చేస్తోంది. మధ్యాహ్నానికి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న ఓ తోపుడు బండిపై ప్లాస్టిక్ బ్యాగ్ కనిపించింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో బహుశా అందులో చెత్త నింపి అక్కడ వదిలేసి వెళ్లారేమోనని భావించింది. దానిని చెత్తకుప్పలో పడేద్దామనుకుని, అసలు ఆ బ్యాగులో ఏముందో చూద్దామని అనుకుంది. బ్యాగు తెరచిచూడగా బంగారు నగలు కనిపించాయి.దీంతో అక్కడే కాసేపు ఎదురుచూసిన పద్మ.. ఆ నగల కోసం ఎవరూ రాకపోవడంతో బ్యాగును నేరుగా పాండీ బజార్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించింది. పోలీసులు ఆ బ్యాగును పరిశీలించగా.. మొత్తం 36 తులాల బంగారు నగలు ఉన్నట్లు తేలింది. వాటి విలువ సుమారు రూ.45 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. రమేష్ అనే వ్యక్తి వాటిని పోగొట్టుకున్నట్లు గుర్తించారు. తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో నగల బ్యాగును తోపుడు బండిపై పెట్టిన రమేష్.. తర్వాత బ్యాగును మరిచిపోయి వెళ్లినట్లు గుర్తించారు. ఆ నగలను కొన్న పత్రాలను పరిశీలించిన తర్వాత పోలీసులు వాటిని రమేష్ కు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa