ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఉద్యోగులకు .. పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 07:36 PM

సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల శాఖ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పండుగ పూట వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా (ఏడీ) విధులు నిర్వహిస్తున్న వారిని డిప్యూటీ డైరెక్టర్లుగా (డీడీ) పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 సంవత్సరానికి గాను జిల్లా పరిశ్రమల అధికారులు/డిప్యూటీ డైరెక్టర్ల ఖాళీల్లో తాజాగా ప్రమోషన్ పొందిన ఉద్యోగులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో పాటు పలువురు ఏడీలను వివిధ జిల్లాలకు బదిలీ చేశారు.


పదోన్నతుల విషయానికి వస్తే.. కె. నాగేంద్రబాబు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా.. తాజాగా ఆయనను విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు ఆఫీసులో పెట్టుబడుల ప్రోత్సాహక అధికారిగా పదోన్నతి కల్పించారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఏడీగా విధులు నిర్వహిస్తున్న సీతారాంకు పదోన్నతి కల్పించి.. అదే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అధికారిగా (డీడీ హోదా) నియమించారు.


వీరితో పాటు ప్రస్తుతం పరిశ్రమల శాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్‌బాబుకు పదోన్నతి కల్పించి.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ డీడీ పోస్టు ఖాళీగా ఉండగా.. ఆ పోస్టును శ్రీధర్ బాబుతో భర్తీ చేయనున్నారు.


కృష్ణార్జున రావు.. ఇండస్ట్రీస్ కమిషనర్ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు డీడీగా పదోన్నతి కల్పించి, అదే కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించారు. వైఎస్సార్ కడప జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో శ్రీనివాస రెడ్డి ఏడీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఆయనకు పదోన్నతి కల్పించడంతో పాటుగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పరిశ్రమల శాఖ కార్యాలయానికి బదిలీ చేశారు.


ప్రదీప్ కుమార్.. కృష్ణా జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు పదోన్నతి కల్పించి గుంటూరు జిల్లా పరిశ్రమల కార్యాలయానికి బదిలీ చేశారు. కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసులు రెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. ఆపై ఆయనను ప్రకాశం జిల్లాలోని పరిశ్రమల శాఖ కార్యాలయానికి బదిలీ చేశారు. పదోన్నతులకు సంబంధించిన ఈ ఉత్తర్వుల అమలుకు పరిశ్రమల శాఖ కమిషనర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa