ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే 4వ ఖరీదైన విడాకులు.. సెటిల్‌మెంట్ విలువ రూ. 15,000 కోట్లు

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 09:02 PM

జోహో అధినేత శ్రీధర్ వేంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న విడాకుల పోరాటం కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రమీల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును 1.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,000 కోట్లు) విలువైన బాండ్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల తర్వాత నాలుగో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది.


భార్య సంచలన ఆరోపణలు..


1993లో శ్రీధర్ వేంబు, ప్రమీలా శ్రీనివాసన్ వివాహం జరిగింది. దాదాపు 25 ఏళ్ల పాటు అమెరికాలో కలిసి ఉన్న ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే 2020లో ప్రమీల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న తమ కుమారుడిని, తనను అమెరికాలోనే వదిలేసి శ్రీధర్ వేంబు శాశ్వతంగా భారత్‌కు వెళ్లిపోయారని ఆమె వాపోయారు. అలాగే కాలిఫోర్నియాలోని ఉమ్మడి ఆస్తి చట్టాల నుంచి తప్పించుకోవడానికి శ్రీధర్ వేంబు జోహో కంపెనీ షేర్లను, మేధో సంపత్తిని తన తోబుట్టువుల పేరిట రహస్యంగా బదిలీ చేశారని ఆరోపించారు.


అది మాత్రమే కాకుండా పెళ్లయినప్పటి నుంచి కంపెనీ తనదేనని చెప్పిన శ్రీధర్.. విడాకుల సమయానికి తన వాటా కేవలం 5 శాతమేనని, మిగిలిన 80 శాతానికి పైగా వాటా తన సోదరి రాధా వేంబు, సోదరుడు శేఖర్ వేంబులకు ఉందని కోర్టులో చెప్పడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రమీల పేర్కొన్నారు. అయితే శ్రీధర్ వేంబు ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. తాను గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేసేందుకే భారత్‌కు వచ్చానని.. తన భార్యా పిల్లలను కూడా రమ్మని కోరానని ఆయన వివరణ ఇచ్చారు. షేర్ల బదిలీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, మొదటి నుంచి తన కుటుంబ సభ్యులకూ అందులో వాటాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


జోహో మేధో సంపత్తిని 50 మిలియన్ డాలర్లకు ఇండియా కంపెనీకి విక్రయించినా.. ఆ నిధులు ఇంకా అమెరికా కంపెనీ దగ్గరే ఉన్నాయని ఆయన వాదించారు. ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తి విలువ సుమారు 5.85 బిలియన్ డాలర్లుగా అంచనా. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్‌తో పాటు జోహోకు చెందిన కొన్ని అమెరికా విభాగాలపై పర్యవేక్షకుడిని కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లారు. మరి ఈ బిలియన్ డాలర్ల వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa