ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లష్కరే తొయిబాలో భారీ చీలిక.. పాకిస్థాన్‌కు షాక్

international |  Suryaa Desk  | Published : Tue, Jan 13, 2026, 09:05 PM

పాకిస్థాన్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో పెద్ద చీలిక రాబోందని, దీనివల్ల దాయాది పరిస్థితి మరింత గందరగోళంగా మారే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వానికి నమ్మకమైన ఆయుధంగా ఉన్న లష్కర్‌లో ఇంతకుముందెన్నడూ ఇలాంటి తిరుగుబాటు చోటుచేసుకోలేదు. లష్కరే ఎప్పుడూ పాక్ గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చెప్పినట్లే నడుచుకుంది. కానీ ఇటీవల కొన్ని నిర్ణయాలపై ఆ సంస్థలోని కొందరు కీలక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత లష్కరే చాలా ఆస్తులను కోల్పోయింది. అప్పటి నుంచి అది కోలుకోవడం చాలా కష్టమైంది. ఐఎస్ఐ, పాకిస్థాన్ సైన్యం తమను సరిగ్గా కాపాడలేదని లష్కరే ఉగ్రవాద సంస్థల్లో చాలామంది భావిస్తున్నారు.


విభేదాలను పరిష్కరించడానికి ఐఎస్ఐ ప్రయత్నించినా.. తమను తాలిబాన్, తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి సంస్థలపైకి ఉసిగొల్పాలనే పాక్ సైన్యం, ఐఎస్ఐ నిర్ణయం చాలామంది లష్కరే కార్యకర్తలకు నచ్చలేదు. చైనా, అమెరికా వంటి దేశాల ప్రయోజనాల కోసం, ముఖ్యంగా బలూచిస్థాన్‌లోని అరుదైన ఖనిజాల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వారు భావిస్తున్నారు. టీటీపీ, బీఎల్ఏ సంస్థలు బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్థాన్ సైన్యంతో పోరాడుతున్నాయి. వారిని ఎదుర్కోలేక ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్సు (ISKP)తో కలిసి లష్కరేను పాక్ సైన్యం రంగంలోకి దించింది.


‘మన సొంత ప్రజలతో ఎందుకు పోరాడాలి? చైనా, పశ్చిమ దేశాల ప్రయోజనాల కోసం ఎందుకు పోరాడాలి?’ అని లష్కర్ నాయకత్వం ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా, ఐఎస్కేపీతో లష్కరే తొయిబాకు సహజంగానే పొసగదు. ఎందుకంటే దీనిని తాలిబన్లకు శత్రువులుగా పరిగణిస్తుంది. లష్కరే ఎప్పుడూ తాలిబాన్‌లకు మద్దతుగా నిలుస్తుంది. ఇప్పుడు పాకిస్థాన్ సైన్యం ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్‌లతో పోరాడటం లష్కరే నాయకత్వానికి మరింత ఆగ్రహం తెప్పించింది.


ఈ అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తోంది. ‘మాపై మరీ ఎక్కువ భారం మోపుతున్నారు’ అని కార్యకర్తలు భావిస్తున్నారు. ‘మన ప్రజలతో ఎందుకు పోరాడాలో నాయకత్వం మాకు చెప్పలేకపోతోంది. మనమంతా కలిసికట్టుగా ఉండి, కేవలం భారత్, పశ్చిమ దేశాలపైనే పోరాడాలి’ అని కార్యకర్తలు అంటున్నారు.


ఇటీవల లష్కర్ కమాండర్ మహమ్మద్ అష్ఫాక్ రానా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లపై విరుచుకుపడ్డారు. ‘వారు మమ్మల్ని కాపాడటంలో విఫలమయ్యారు.. దేశాన్ని అప్పుల్లో ముంచారు. అప్పుగా తెచ్చిన డబ్బులో సగం కూడా సరిగ్గా వాడితే దేశం బాగుపడేది’ అని రానా అన్నాడు. ఈ పరిణామాలన్నీ లష్కర్‌లో చీలికకు సంకేతాలని అధికారులు అంటున్నారు.


హఫీజ్ సయీద్ బయట ప్రపంచానికి కనిపించకపోవడం కూడా ఏదో తేడాగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. లష్కరే తొయిబా బహిరంగంగా తిరుగుబాటు చేస్తే అది చాలా ప్రమాదకరం. దానిలో చాలామంది కార్యకర్తలు అంకితభావంతో ఉంటారు. వారు తిరుగుబాటు చేసి టీటీపీ వంటి సంస్థల్లో చేరితే, పాకిస్థాన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. పాకిస్థాన్‌లో హింస పెరిగి, ఉగ్రవాద సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తే, అది మొత్తం ప్రాంతానికి భద్రతాపరమైన ముప్పుగా మారుతుంది. లష్కరేలో ఇలా జరిగితే, త్వరలోనే జైషే మహమ్మద్‌లోనూ ఇలాంటి పరిణామాలను చూడవచ్చని మరో అధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa