ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'40 ఏళ్లుగా దేశాన్ని ఉగ్రవాద అడ్డాగా మార్చారు': కెనడాపై భారత రాయబారి నిప్పులు

international |  Suryaa Desk  | Published : Wed, Jan 14, 2026, 08:56 PM

భారత్, కెనడాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. కెనడా గడ్డపై భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవడంలో ఆ దేశం గత 40 ఏళ్లుగా పూర్తిగా విఫలమైందని కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ ఘాటుగా విమర్శించారు. కెనడా ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ 'సీబీసీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కెనడా తీరును తూర్పారబట్టారు.


సాక్ష్యాలు లేని ఆరోపణలు వద్దు..


ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేస్తున్న ఆరోపణలను పట్నాయక్ గట్టిగా తిప్పికొట్టారు. "ఆరోపణలు చేయడం చాలా సులభం.. కానీ వాటికి బలం చేకూర్చే సాక్ష్యాలెక్కడ?" అని ఆయన ప్రశ్నించారు. భారత ప్రభుత్వం ఇలాంటి అనైతిక చర్యలకు ఎన్నడూ పాల్పడదని, ఒకవేళ ఏదైనా ఆధారాలు చూపిస్తే విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కానీ కేవలం ఊహాగానాల ఆధారంగా దేశాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు.


40 ఏళ్ల నాటి ‘కనిష్క’ ఉదంతం ప్రస్తావన


కెనడా ప్రభుత్వం ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ నీతి పాటిస్తోందని ఆయన ఆరోపించారు. 1985లో 329 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా (కనిష్క) విమానం పేలుడు ఘటనను ఉదహరిస్తూ.. "40 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ కేసులో ఒక్కరిని కూడా శిక్షించలేకపోయారు. మీ గడ్డపై ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదు" అని విమర్శించారు. భారత్ తగిన ఆధారాలతో ఉగ్రవాదుల జాబితా ఇచ్చినప్పుడు సాక్ష్యాలు సరిపోవు అని చెప్పే కెనడా.. ఇప్పుడు భారత్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.


కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతంతరించుకున్నాయి. ఆర్థిక ఒప్పందాలు, వాణిజ్య చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నప్పటికీ.. భద్రతాపరమైన అంశాల్లో కెనడా తన ధోరణిని మార్చుకోనంత వరకు శాశ్వత మైత్రి అసాధ్యమని దినేష్ పట్నాయక్ స్పష్టం చేశారు. "చట్టం ముందు ఎవరైనా సరే నేరం నిరూపితమయ్యే వరకు నిరపరాధులే. కాబట్టి సాక్ష్యాలు లేకుండా తీర్పులు చెప్పడం మానుకోవాలి" అని ఆయన గట్టిగా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa