పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్యను మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చట్టబద్ధ పాలన పూర్తిగా కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్ఆర్సీపీకి చెందిన దళిత కార్యకర్తను అన్యాయంగా టీడీపీ నాయకులు పొట్టనపెట్టుకున్నారని పేర్కొంటూ, అధికార పార్టీ గూండాల అరాచకాలకు ఈ హత్య నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యక్తుల భద్రతకు ఎలాంటి భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని కక్ష రాజకీయాలకు బలిచేస్తున్నారని పేర్కొన్న వైయస్ జగన్, ఈ ఘటనకు బాధ్యులైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.ఈ సందర్భంగా టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన సాల్మన్ సోదరుడితో వైయస్ జగన్ ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. సాల్మన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో వైయస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే దోషులపై కఠిన చర్యలు తీసుకుని, వారికి తగిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa