భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గాయకుడు బి ప్రాక్ ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్లోకి చేరారు. సల్మాన్ ఖాన్ వంటి దిగ్గజాలనే టార్గెట్ చేసిన ఈ ప్రమాదకరమైన ముఠా.. ఇప్పుడు బి ప్రాక్ను ఏకంగా రూ.10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ప్రాణాపాయం ఉందని బెదిరించింది. ఈ మేరకు మొహాలీ పోలీసులకు ఫిర్యాదు అందడంతో పంజాబ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
బెదిరింపు కాల్ వెనుక ఉన్నది ఎవరు..?
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల ప్రారంభంలో జనవరి 5వ తేదీన బి ప్రాక్ సన్నిహితుడు, సహ గాయకుడు అయిన దిల్నూర్కు విదేశీ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ సమయంలో దిల్నూర్ స్పందించకపోవడంతో.. మరుసటి రోజు ఒక వాయిస్ మెసేజ్ పంపారు. అందులో అవతలి వ్యక్తి తనను తాను లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడిగా (అర్జు బిష్ణోయ్ లేదా అన్మోల్ బిష్ణోయ్ అని భావిస్తున్నారు) పరిచయం చేసుకున్నాడు.
"ఈ సమాచారాన్ని బి ప్రాక్కు చేరవేయి. మాకు వారం రోజుల్లో రూ.10 కోట్లు అందాలి. అతను ఏ దేశానికి వెళ్లినా సరే. మా కన్ను అతడిపై ఉంటుంది. డబ్బు అందకుంటే బి ప్రాక్ను మట్టిలో కప్పెడతాం.. అతడిని బూడిద చేస్తాం" అని చెప్పారు. ఈ ఆడియో క్లిప్పింగ్ను ఆధారంగా చేసుకుని దిల్నూర్ మొహాలీ ఎస్ఎస్పీకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. గతంలో సిద్దూ మూసేవాలా హత్య, గతేడాది ఏపీ ధిల్లాన్ ఇంటి వద్ద కాల్పులు వంటి ఘటనల నేపథ్యంలో పోలీసులు ఈ బెదిరింపును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. బి ప్రాక్ ఇంటి వద్ద, ఆయన ప్రయాణించే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే ఈ ఫోన్ కాల్స్ ఏ దేశం నుండి వచ్చాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం ఆరా తీస్తోంది.
"తేరీ మిట్టీ", "ఫిల్హాల్", "మన్ భర్యా" వంటి అద్భుతమైన గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న బి ప్రాక్కు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం పంజాబీ, బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో భయాందోళనలకు దారితీసింది. వరుసగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. బిష్ణోయ్ గ్యాంగ్ సృష్టిస్తున్న ఈ అలజడికి అడ్డుకట్ట వేయాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa