ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త వినిపించారు. ఏపీ ప్రజలకు ఉగాది కానుక ప్రకటించారు. టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు. ఆస్తిలో మహిళలకు సగం వాటా వంటివి ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలేనని అన్నారు. రాజకీయాల్లో చదువుకున్న వారికి ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీఆరేనని.. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము అన్నక్యాంటీన్లు తెచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే మరో 700 అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా మరో ఐదు లక్షల గృహప్రవేశాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నా్మన్నారు. అలాగే దేశానికి వచ్చిన 25 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో కొంతమంది రాజకీయ పార్టీల ముసుగులో రౌడీయిజం చేస్తున్నారన్న చంద్రబాబు.. అలాంటి వారిని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
మరోవైపు ఐదేళ్ల కాలంలో పేదలకు 15 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ ఇల్లు అనే ఉద్దేశంతో చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి మూడు నెలలకూ ఒకసారి నిర్మాణం పూర్తి అయిన ఇళ్లల్లో.. గృహ ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఐదేళ్లలో 15 లక్షల మందికి ఇళ్లు పంపిణీ చేసే లక్ష్యంలో భాగంగా.. ఉగాదికి మరో 5 లక్షల గృహప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియను కూడా అధికారులు వేగవంతం చేశారు.
ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించడంపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. మరోవైపు పీఎం ఆవాస్ యోజన కింద ఇటీవల ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు కూడా స్వీకరించారు. పట్టణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ ప్రాంతాలలో పీఎం ఆవాస్ యోజన్ రూరల్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa