జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం .. మనదేశంలో విజయవంతంగా అమలవుతూ.. ఎక్కువ మంది ప్రయోజనం పొందుకున్న పథకం. గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఉపాధి లేదనే కారణంగా గ్రామాల నుంచి వలస వెళ్లకుండా.. వారికి పని కల్పిస్తూ అండగా నిలుస్తోంది ఉపాధి హామీ పథకం . కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరును ఇటీవల వీబీ జీరామ్జీ పథకంగా మార్చిన సంగతి తెలిసిందే. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తూ ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్యను 125 రోజులకు పెంచారు. అలాగే ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనాన్ని కూడా పెంచారు. గతంలో ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.250 వేతనం చెల్లించేవారు. తాజాగా ఈ మొత్తాన్ని 307 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది.
మరోవైపు ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది శ్రామికులు ఉపాధి పనులకు హాజరయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ కూలీల కోసం కొత్తగా మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఉపాధి హామీ కూలీల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.18002001001 నంబరుతో ఉపాధి కూలీలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఉపాధి హామీ కూలీలకు(శ్రామికులు) పని ప్రదేశంలో కొన్ని వసతులు కల్పిస్తుంటారు. తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, పనిముట్లు, మౌలిక వసతులను నిబంధనల ప్రకారం కల్పించాల్సి ఉంటుంది.
అయితే కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో ఇది అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో వసతులు కల్పించకపోయినా, చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోయినా కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగించి ఉపాధి కూలీలు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే కొత్త జాబ్ కార్డుల జారీలోనూ ఏవైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు.
ఈ టోల్ ఫ్రీ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని.. ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు.. ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని డ్వామా అధికారులు వెల్లడించారు. ఫిర్యాదు వివరాలను నమోదు చేసిన అనంతరం.. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు. ఉపాధి పనులకు హాజరయ్యేవారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa