ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో విడత భూసమీకరణలో మారిన ప్లాన్.. ఇక మరింత వేగంగా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 07:10 PM

అమరావతి రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం రెండో విడత భూసమీకరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏడు గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని రెండో విడతలో సమీకరించనున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించనుంది. అయితే తొలివిడతలో మాదిరిగా కాకుండా ఈసారి రైతులందరికీ ఒకేచోట రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించనున్నట్లు సమాచారం. అమరావతి కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ సింగిల్ లేఅవుట్ అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం.


ఈ దిశగా సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించనున్నారు. రాజధాని అమరావతి విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం రెండో విడత భూసమీకరణ చేపడుతోంది. తొలి దశలో రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు ప్రతి గ్రామంలో లేఅవుట్లను అభివృద్ధి చేశారు. రైతులు తమ గ్రామాల్లోనే రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని పట్టుబట్టడంతో ప్రభుత్వం.. వారి గ్రామాల్లోనే లేఅవుట్లను అభివృద్ధి చేశారు.


అయితే ఈ నిర్ణయంతో లేఅవుట్ల అభివృద్ధి తర్వాత ప్రభుత్వానికి లభించిన భూమి వేర్వేరు ప్రాంతాలలో ఉండిపోయింది. పెద్ద కేటాయింపులు చేయడానికి ఒకే చోట పెద్ద మొత్తంలో భూమి అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభుత్వానికి సమస్యలు ఎదురయ్యాయి.


 మరోవైపు ఎక్కువ లేఅవుట్లు ఉండటం వల్ల ప్రతి లేఅవుట్‌కు ప్రత్యేక మౌలిక సదుపాయాలు అవసరమని, దీనివల్ల ఖర్చులు పెరుగుతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే రెండో విడతలో భూములు అప్పగించే రైతులకు ఒకేచోట లేఅవుట్ అభివృద్ధి చేసి.. అందులోనే రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించే ఆలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఒకే చోట ప్లాట్లు కేటాయించడం వల్ల ప్రభుత్వం సేకరించిన భూములు ఏకీకృతం అవుతాయని, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ప్రాజెక్టులకు కేటాయించడానికి అనుకూలంగా ఉంటాయని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులకు ఒకే చోట భారీ భూమి అవసరమని అధికారులు చెప్తున్నారు.


మరోవైపు అభివృద్ధి చేసిన ప్లాట్లను వెంటనే అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఒకే లేఅవుట్‌ను అభివృద్ధి చేస్తే పనులు త్వరగా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచేందుకు సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa