పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ పనిచేస్తున్న భారత దౌత్య అధికారులు, ఇతర సిబ్బంది కుటుంబ సభ్యులను తిరిగి స్వదేశానికి రావాలని సూచించింది. బంగ్లాదేశ్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరసన కార్యకలాపాలు పెరగడంతో ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి."భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముందుజాగ్రత్త చర్యగా మా అధికారుల కుటుంబ సభ్యులను భారత్కు తిరిగి రావాలని సూచించాం" అని అధికార వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి తెలిపాయి. అయితే, ఢాకాలోని భారత హైకమిషన్తో పాటు చట్టోగ్రామ్, ఖుల్నా, రాజ్షాహి, సిల్హెట్లోని ఇతర దౌత్య కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశాయి. ఒక దేశంలో భద్రత లేనప్పుడు లేదా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి 'నాన్-ఫ్యామిలీ' పోస్టింగ్ ఆదేశాలు జారీ చేస్తారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనమై, మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారాయి. ఇటీవల విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై హింస పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఈ దాడులపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీలు, వారి ఆస్తులపై ఆందోళనకారులు పదేపదే దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ దాడులను వ్యక్తిగత కక్షలు లేదా రాజకీయ విభేదాలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని, ఇది నేరస్థులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని ఆయన విమర్శించారు. ఈ ధోరణి మైనార్టీలలో భయాన్ని, అభద్రతాభావాన్ని పెంచుతుందని భారత్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa