ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అండతో తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు కలిసి చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా దిగజారిపోయాయని, అధికార పక్షం వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాల్సిన వారు కక్షసాధింపు చర్యలకు దిగడం రాష్ట్ర భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
ఇటీవల పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో దారుణ హత్యకు గురైన వైస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ కుటుంబ సభ్యులు బుధవారం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలిశారు. తమ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను, స్థానిక టీడీపీ నేతలు అనేక రకాలుగా వేధిస్తున్నారని సాల్మన్ కుమారులు జగన్ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామంలో ఉండనివ్వకుండా భౌతిక దాడులకు దిగుతూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
బాధితుల మాటలు విన్న జగన్ వారిని ఓదార్చి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బాధితుల తరపున పోరాడటానికి పార్టీ లీగల్ సెల్ సిద్ధంగా ఉందని, బాధితులకు అవసరమైన పూర్తి స్థాయి న్యాయ సహాయాన్ని ఉచితంగా అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించే అధికారులపై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రంలో వైస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యకర్తల రక్షణే ధ్యేయంగా పార్టీ పనిచేస్తుందని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఈ అరాచకాలకు పాల్పడుతున్న వారు కచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa