ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఒక మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది. సాధారణ ట్రైనింగ్లో భాగంగా బామ్రౌలీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్క్రాఫ్ట్.. ఇంజిన్ వైఫల్యం కారణంగా రాంబాగ్ ప్రాంతంలోని ఒక చెరువులో కుప్పకూలింది.
ప్రమాద సమయంలో విమానంలో గ్రూప్ కెప్టెన్ ప్రవీణ్ అగర్వాల్ (బామ్రౌలీ స్టేషన్ సీఓఓ), గ్రూప్ కెప్టెన్ సునీల్ కుమార్ పాండే (బామ్రౌలీ స్టేషన్ సీఏఓ) ఉన్నారు. విమానం కంట్రోల్ తప్పడంతో.. ఆ ఇద్దరు గ్రూప్ కెప్టెన్లు.. ఎమర్జెన్సీ పారాచూట్లను ఉపయోగించి కిందికి దూకేశారు. విమానం కూలిపోయినట్లు గుర్తించిన స్థానికులు.. ఆ ఇద్దరు పైలట్లను సురక్షితంగా రక్షించి బయటికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని రక్షణ శాఖ ప్రతినిధి వింగ్ కమాండర్ దేబార్తో ధర్ వెల్లడించారు.
ఈ నెలలోనే రెండో ప్రమాదం
అయితే ఈ జనవరి నెలలో ఐఏఎఫ్ విమానం ప్రమాదానికి గురి కావడం రెండోసారి కావడం గమనార్హం. ఈనెల 10 వ తేదీన భువనేశ్వర్ నుంచి రూర్కెలా వెళ్తున్న ఇండియా వన్ ఎయిర్కు చెందిన సెస్నా విమానం సాంకేతిక లోపంతో రూర్కెలా సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అందులో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా ప్రయాగ్రాజ్లో ఐఏఎఫ్ విమానం కుప్పకూలింది.
విచారణకు ఆదేశించిన ఐఏఎఫ్
విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, భారత వైమానిక దళ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం నీటిలో సగం మునిగిపోయింది. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఐఏఎఫ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa