దేశీయ స్టాక్ మార్కెట్లులో నష్టాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈవారం సూచీలు వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ జనవరి 21 బుధవారం రోజు ఒక దశలో 1,050 పాయింట్లు (1.3 శాతం) మేర క్షీణించి 81,124 స్థాయికి పడిపోయింది. కానీ, ఆ తర్వాత వేగంగా కోలుకుంది. చివరకు 271 పాయింట్లు నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ 200 రోజుల EMA కిందకు పడిపోయి 24,919 వరకు క్షీణించింది. చివరకు 75 పాయింట్లు (0.30 శాతం) నష్టంతో 25,157 వద్ద ముగిసింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి. ఇండియా VIX (భయం సూచిక) 8 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
మూడు రోజుల్లో ఎంత నష్టం?
మూడు రోజుల్లో కలిపి సెన్సెక్స్ 1,661 పాయింట్లు (2శాతం) మేర పడిపోయింది. నిఫ్టీ సూచీ కూడా 2 శాతానికిపైగా పడిపోయింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల విలువ ఏకంగా రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయింది. రూ. 468 లక్షల కోట్ల నుంచి రూ. 454 లక్షల కోట్లకు తగ్గింది.
కారణాలు ఇవే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండును దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు అడ్డువస్తే యూరోపియన్ దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం, జూన్ నుంచి 25 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. యూరప్ దేశాలు సైతం అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించేందుకు సన్నద్ధమయ్యాయి. ఈ అంశం ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను పెద్ద దెబ్బ తీస్తుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా డాలరుతో పోలిస్తే భారత దేశ కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. 91.69 స్థాయిని తాకింది. ఇది చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. గత ఏడాది 5 శాతం మేర పడిపోయిన రూపాయి విలువ ఈ ఏడాది 2026లో ఇరవై రోజుల్లోనే 2 శాతం మేర తగ్గింది. విదేశీ మదుపరుల అమ్మకాలు, అమెరికా సుంకాలతో ఇది జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జనవరి 20 వరకు విదేశీ మదుపరులు రూ.32,000 కోట్లకు పైగా దేశీయ ఈక్విటీల్లో అమ్మకాలు చేపట్టారు. జులై, 2025 నుంచి చూసుకుంటే మొత్తం రూ.2.2 లక్షల కోట్లు విలువైన ఈక్విటీలను అమ్మేశారు. గ్లోబల్ రిస్క్లు, టారిఫ్ భయాలతో భారత స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను తరలిస్తున్నారు.
గ్లోబల్ టెన్షన్, క్యూ3 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, బడ్జెట్ సమీపించడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు గోల్డ్, సిల్వర్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
నిఫ్టీ 200 డే EMA (సుమారు 25,150) కిందకు పడిపోయింది. ఇది బలహీనతకు సంకేతంగా చెబుతారు. రికవరీ అయినా 25,400- 25,600 జోన్ రెసిస్టెన్స్గా పని చేస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 25,080 కిందకు వస్తే 24,900 వరకు తగ్గవచ్చంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa