ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచు తుఫానులో 12 మంది... ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

national |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 09:02 PM

భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 12 మందిని జమ్మూ కశ్మీర్ పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మూడు గంటలు పాటు శ్రమించి వారిని కాపాడారు. బాధితుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. ఉధంపూర్ జిల్లా చోచ్రు గల్లా ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా స్థానికులు మంచులో చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే రెస్యూ కోసం రంగంలోకి దిగింది. మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. చోచ్రు గల్లా ప్రాంతానికి దాదాపు 12 కి.మీ. దూరంలో ఉన్న సంఘ్ పోలీస్ పోస్టుకు అత్యవసర సహాయం కోరుతూ ఫోన్ కాల్ వచ్చింది. తక్షణమే స్పందించిన పోలీసులు.. అక్కడకు బయలుదేరారు.


ఓవైపు, మంచు దట్టంగా కురుస్తుండగా.. క్లిష్టమైన మార్గంలో సుమారు 3 గంటల పాటు ప్రయాణించి చోచ్రుగల్లా సమీపాన బసంత్‌గఢ్కు చేరుకున్నారు. బాధితుల చేతులు పట్టుకుని పోలీసులు సురక్షితంగా నడిపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైనట్లు పోలీసులు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు.


‘‘బసంత్‌గఢ్ ఎగువ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం వల్ల భారీ హిమపాతం లో చిక్కుకుపోయిన 12 మందిని తమ సిబ్బంది మూడు గంటలు పాటు శ్రమించి వారిని రక్షించారు’’ అని తెలిపారు. అనంతరం వారిని పోలీస్ పోస్టుకు తరలించి, ఆహారం, ఆశ్రయం, వైద్య సహాయం అందించినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా, భారీ హిమపాతం, వర్షాల నేపథ్యంలో ఉధంపూర్ జిల్లాలోని విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. శ్రీనగర్‌లో కూడా తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో భారీగా హిమపాతం కురిసి, జనజీవం స్తంభించిపోతుంది.


జనవరి నెలలో హిమాలయాలు ప్రాంతాలు తెల్లటి మంచుతో వెండి కొండల్లా మెరిసిపోతాయి. కానీ, ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి నెలకుంది. జనవరి మూడోవారం దాటినా అనేక ప్రాంతాల్లో మంచు జాడ లేదు. ఎటుచూసినా బోసిపోయినట్టుగానే కొండలు కనిపిస్తున్నాయి. సీజన్‌లో ఇక్కడ కురిసే మంచే వేసవిలో కరిగి గంగా యమున వంటి జీవ నదులకు నీటిని అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితికి. గ్లోబల్‌ వార్మింగు ప్రభావమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa