ర్యాపిడో, ఉబర్, ఓలా అగ్రిగేటర్లకు భారీ ఊరట లభించింది. కర్ణాటకలో వీటిపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలు మళ్ళీ మొదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. హైకోర్టు ఈ సేవలను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయిన బైక్ టాక్సీ సేవలు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఈ తీర్పుతో రైడ్-హెయిలింగ్ కంపెనీలతో పాటు, బైక్ టాక్సీ నడిపే డ్రైవర్లకు కూడా పెద్ద ఉపశమనం లభించింది.
గతంలో వీటిపై నిషేధం విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ.. శుక్రవారం నాడు చీఫ్ జస్టిస్ విబు బఖ్రు, జస్టిస్ సి.ఎం. జోషిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కీలక తీర్పును వెలువరించింది. మోటార్ సైకిళ్లను కూడా రవాణా వాహనాలుగా నమోదు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, బైక్ టాక్సీ సేవలు నడపడానికి అవసరమైన క్యారేజ్ పర్మిట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
మోటార్ వెహికల్ చట్టంలో బైక్ టాక్సీల ప్రస్తావన లేదనే కారణంతో కర్ణాటక ప్రభుత్వం ఈ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో సుమారు ఏడాది క్రితం ఓలా, ర్యాపిడో, ఉబర్ ఇండియా, రోప్పెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ వంటి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే మొదట హైకోర్టు వీటిపై నిషేధాన్ని సమర్థించింది. ఆ తీర్పు ప్రకారం కర్ణాటక ప్రభుత్వం జూన్ 16, 2025 నుంచి బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని యాప్-ఆధారిత అగ్రిగేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడోలు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించాయి. తాజాగా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ దీనిపై విచారణ జరిపి, నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు వెల్లడించింది.
ఈ కోర్టు తీర్పుపై రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి స్పందించారు. తీర్పు కాపీ ఇంకా తనకు అందలేదని ఆయన తెలిపారు. అయితే, సింగిల్ జడ్జి బెంచ్ గతంలో ఇచ్చిన బైక్ టాక్సీ నిషేధానికి అనుకూలమైన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసిందని మంత్రి ధృవీకరించారు.
ఓలా, ఉబర్ సంస్థలు ఈ తీర్పును స్వాగతించాయి. బైక్ టాక్సీలు తక్కువ ఖర్చుతో కూడుకున్న రవాణా మార్గాలని, పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉబెర్ స్పందిస్తూ.. "కర్ణాటకలో బైక్ టాక్సీలను చట్టబద్ధమైన ప్రయాణికుల రవాణా మార్గంగా గుర్తించిన గౌరవనీయ హైకోర్టు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ నిర్ణయం తమ జీవనోపాధి కోసం బైక్ టాక్సీలపై ఆధారపడే లక్షలాది మంది డ్రైవర్లకు ఊరటనిస్తుంది. వారందరికీ ఈ తీర్పు ఎంతో మేలు చేయనుంది" అని తెలిపింది.
ఈ తీర్పుతో కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలు మళ్ళీ ప్రారంభం కావడం ప్రయాణికులకు, డ్రైవర్లకు, రైడ్-హెయిలింగ్ కంపెనీలకు ఒక శుభవార్తగా మారింది. ఇది నగరాల్లోని రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన మార్పును తీసుకురావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ దూర ప్రయాణాలకు ప్రజా రవాణా సరిగా అందుబాటులో లేని ప్రాంతాలకు బైక్ టాక్సీలు ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారుతాయి. ఇది ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరుస్తుంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa