కోతి లాక్కెళ్లి బావిలో పడేసిన 20 రోజుల పసికందు ప్రాణాలు దక్కాయి. చిన్నారి వేసుకున్న డైపర్ లైఫ్ జాకెట్లా పనిచేసి నీటిపై తేలేలా చేయడంతో ప్రమాదం తప్పింది. గ్రామస్థులు, నర్సు రాజేశ్వరి సమయస్ఫూర్తితో పాపకు పునర్జన్మ లభించింది. డైపర్ వల్ల ప్రాణాలు నిలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఛత్తీస్గఢ్లో ఒక అద్భుతం జరిగింది. మృత్యువు ఒడిలోకి వెళ్లిన 20 రోజుల పసికందును.. ఆమె వేసుకున్న డైపర్ ప్రాణదాతగా మారి కాపాడింది. తల్లి చంకో ఉన్న పసికందుపై కోతి దాడి చేసి బావిలో పడేసినా, చిన్నారి క్షేమంగా బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఛత్తీస్గఢ్లోని సియోని గ్రామంలో అరవింద్ రాథోడ్ అనే వ్యక్తి భార్య తన 20 రోజుల పసికందుతో ఇంటి బయట కూర్చుని ఉండగా.. ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది. ఓ కోతి ఆమె ఒడిలోని పాపను లాక్కెళ్లింది. గ్రామస్థులు వెంటాడటంతో.. భయపడిన ఆ కోతి చిన్నారిని సమీపంలోని బావిలో పడేసి పారిపోయింది.
పాప బావిలో పడిపోవడంతో గ్రామస్థులు హాహాకారాలు చేశారు. అయితే.. బావిలో నీటిపై చిన్నారి మునిగిపోకుండా తేలుతూ కనిపించింది. పాప వేసుకున్న డైపర్ నీటిని పీల్చుకుని గాలిని నింపుకోవడంతో అది ఒక లైఫ్ జాకెట్లా పనిచేసింది. దీనివల్ల చిన్నారి సుమారు 10 నిమిషాల పాటు నీటిపై తేలియాడింది. గ్రామస్థులు వెంటనే బకెట్ సహాయంతో చిన్నారిని బయటకు తీశారు.
అదృష్టవశాత్తూ ఆ సమయంలో గ్రామంలో ఒక వేడుక కోసం వచ్చిన నర్సు రాజేశ్వరి రాథోడ్ వెంటనే స్పందించారు. పాపకు అత్యవసరంగా సీపీఆర్ అందించడంతో చిన్నారి తిరిగి శ్వాస తీసుకోగలిగింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. చిన్నారి క్షేమంగా ఉందని డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామాల్లో కోతుల దాడులు పెరుగుతున్నాయనే ఆందోళనలు మరోసారి వ్యక్తం అయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కోతులు , ఇతర వన్యప్రాణుల దాడులు పెరుగుతున్నాయని.. గ్రామస్థులు పేర్కొన్నారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వదలకూడదని.. వన్యప్రాణుల సంచారం ఉన్న చోట మరింత అప్రమత్తంగా ఉండాలని బాధితురాలి తండ్రి విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa