కర్ణాటక అసెంబ్లీలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీలో జరిగిన గందరగోళం, తలెత్తిన వివాదాలపై పూర్తి స్థాయి నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్కు మధ్య నెలకొన్న విభేదాలను ఈ నివేదికలో ఆయన స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ ముసాయిదాలో మార్పులు చేయాలని తాను సూచించిన విషయాన్ని గవర్నర్ ఈ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. ప్రసంగంలోని 2 నుండి 11 పేరాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించే అంశాలు ఉన్నాయని, అందుకే వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ముందే సూచించానని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలను ప్రసంగంలో చేర్చడం సరికాదన్నది ఆయన వాదనగా కనిపిస్తోంది.
అసెంబ్లీలో ప్రసంగం ముగిసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై కూడా గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ ముగిసిన వెంటనే అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేస్తూ తనను చుట్టుముట్టే ప్రయత్నం చేశారని, తన విధులకు ఆటంకం కలిగించారని నివేదికలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేవాలయం వంటి సభలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆయన రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నివేదిక ఇప్పుడు అటు బెంగళూరులోనూ, ఇటు ఢిల్లీలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. గవర్నర్ సూచనలను ప్రభుత్వం బేఖాతరు చేయడం, ఆపై సభలో జరిగిన గొడవ కర్ణాటక రాజకీయాల్లో సెంట్రల్ పాయింట్గా మారాయి. రాష్ట్రపతి ఈ నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు లేదా కేంద్ర హోం శాఖకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa