కిడ్నీ రోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి కూడా డయాలసిస్ సేవలు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని సెకండరీ ఆసుపత్రులలో త్వరలోనే మరో 13 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
ఈ 13 కొత్త డయాలసిస్ కేంద్రాలలో రెండు కేంద్రాలను ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులలో ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. అక్కడ రోగులకు త్వరలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మిగిలిన 11 కేంద్రాలు ఏప్రిల్ నాటికి సిద్ధమవుతాయని మంత్రి వెల్లడించారు. గతంలో ప్రకటించిన వాటితో పాటు తాజాగా మంజూరైన ఐదు కేంద్రాలను కలిపి సెకండరీ ఆసుపత్రులలో మొత్తం 13 డయాలసిస్ కేంద్రాలు రానున్నాయని పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు ఐదు కొత్త డయాలసిస్ కేంద్రాలకు అనుమతి లభించిందని మంత్రి ప్రకటించారు. ఈ కేంద్రాలను తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లాలోని కొండపి, తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు, కడప జిల్లాలోని మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నారు.
శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వీటి గురించి వివరాలు వెల్లడించారు. ఈ కొత్త డయాలసిస్ కేంద్రాలను 'ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్' ప్రోగ్రామ్ కింద మంజూరు చేశారని మంత్రి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, చిత్తూరు జిల్లాలోని పిలేరు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, నంద్యాల జిల్లాలోని సున్నిపెంట, కడప జిల్లాలోని జమ్మలమడుగు ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని ఆయన పేర్కొన్నారు.
విజయనగరం జిల్లాలోని ఎస్. కోట, పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటలోని ఏజెన్సీ ప్రాంత ఆసుపత్రులలో రెండు డయాలసిస్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు త్వరలోనే సేవలు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. ప్రతి డయాలసిస్ కేంద్రంలో సుమారు రూ. 85 లక్షల విలువైన పరికరాలు ఉంటాయి. మొత్తం 13 కేంద్రాల ఏర్పాటుకు రూ. 11.05 కోట్ల ఖర్చు అవుతుంది. ప్రతి కేంద్రంలో ఐదు డయాలసిస్ యంత్రాలు ఉంటాయని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన 12 డయాలసిస్ కేంద్రాలలో ఇప్పటికే రోగులకు సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. మరో 13 కేంద్రాలు త్వరలో అందుబాటులోకి వస్తే, ప్రభుత్వ 19 నెలల పాలనలో మొత్తం 25 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దీని వల్ల వేలాది మంది రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు చేరువ అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక్కో డయాలసిస్కు సుమారు 3 నుంచి 4 వు రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెలకు కనీసం పదిసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో సామాన్యులకు అది ఆర్థిక భారంగా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,047 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa