మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ముంబయి నుంచి తన సొంత నియోజక వర్గమైన బారామతికి వెళ్తుండగా.. పలు సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అజిత్ పవార్ సహా విమానంలో ఉన్న మరో నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరి మృతదేహాలన్నీ గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. కానీ ముందుగా అజిత్ పవార్ మృతదేహాన్ని అధికారులు గుర్తించగలిగారు. డీఎన్ఏ పరీక్ష చేస్తే తప్పు గుర్తించడానికి వీళ్లేకుండా ఉన్న మృతదేహాల్లో అజిత్ పవార్ను ఎలా గుర్తించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆ 'గడియారమే' ఆయన్ని గుర్తు పట్టేలా చేసింది!
విమానం నేలను ఢీకొన్న వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. విమానం పూర్తిగా దగ్ధమైంది. దీంతో లోపల ఉన్న వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. అయితే అజిత్ పవార్ మృతదేహాన్ని ఆయన ధరించిన 'చేతి గడియారం' ఆధారంగా అధికారులు గుర్తించారు. ఇందులో మరో విషాదకరమైన యాదృచ్ఛికం ఏంటంటే.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ అధికారిక గుర్తు కూడా 'గడియారం' కావడం.. అందులోనూ ఆయన మృతదేహాన్ని దాని ఆధారంగానే గుర్తించడం. నిన్నటి వరకు గడియారం గుర్తుతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన్ను.. చివరికి ఆ గడియారమే అందరూ గుర్తుపట్టేలా చేయడంతో.. అభిమానులు, పార్టీ శ్రేణులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 8.10 గంటలకు ముంబయి నుంచి విమానం బయలుదేరింది. 8.18 నిమిషాలకు బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానం మొదటిసారి సంప్రదింపులు జరిపింది. ఆ సమయంలో గాలులు ప్రశాంతంగా ఉన్నాయని, దృశ్యమానత 3,000 మీటర్లు ఉందని పైలట్లకు సమాచారం ఇచ్చారు. అయితే రన్వే 11పై ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు రన్వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలట్లు 'గో-అరౌండ్' చేశారు. కొద్దిసేపటి తర్వాత రన్వే కనిపిస్తోందని పైలట్లు సమాచారం ఇచ్చారు. 8.43 గంటలకు ల్యాండింగ్కు ఏటీసీ అనుమతి ఇచ్చింది. సాధారణంగా ఏటీసీ అనుమతి ఇచ్చినప్పుడు పైలట్లు దానిని తిరిగి ధృవీకరించాలి. కానీ పైలట్ల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సరిగ్గా 8.45 గంటలకు రన్వే ప్రారంభంలో మంటలు ఎగసిపడటాన్ని ఏటీసీ గమనించింది. సహాయక బృందాలను అప్రమత్తం చేసింది.
ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు పవార్ బారామతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు భార్య సునేత్రా పవార్ (రాజ్యసభ సభ్యురాలు), ఇద్దరు కుమారులు పార్థ్, జయ్ ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత పట్టున్న నాయకుడిగా పేరున్న అజిత్ పవార్ మరణం రాష్ట్రంలో పెద్ద రాజకీయ శూన్యాన్ని మిగిల్చింది. ప్రస్తుతం డీజీసీఏ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. విమాన ప్రమాదానికి గల కారణాన్ని అంచనా వేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa