ఓ దంపతులకు ఇప్పటికే నలుగురు కూతుళ్లు ఉన్నారు. మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. ఐదో కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఇందులో ఒక మగ, ఇద్దరు ఆడ శిశువులు ఉన్నారు. చాలా క్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ను.. అనంతపురం ప్రభుత్వం ఆసుపత్రి గైనిక్ విభాగంలోని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం తల్లీ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈ మేరకు అనంతపురం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వివరాలు వెల్లడించారు.
డాక్టర్ మల్లీశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బ్రహ్మసముద్రం నంజాపురం గ్రామానికి చెందిన రమేష్, కవిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇప్పటికే 17, 10, 8, 5 ఏళ్ల వయసున్న నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ జంట మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న క్రమంలో కవితకు ఒక అబార్షన్ కూడా అయింది. ఆ తర్వాత కవిత మళ్లీ గర్భం దాల్చింది. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కవితను.. హెచ్ఓడీ డాక్టర్ సుచిత్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవ్యశ్రీ పరీక్షించారు. అనంతరం ఎపిలెప్సీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీగా (ఫిట్స్తో బాధపడుతున్నట్లు) నిర్ధారించారు. ఈ విషయాన్ని గైనిక్ విభాగాధిపతి డాక్టర్ షంషాద్బేగం దృష్టికి తీసుకెళ్లారు.
గర్భిణీకి ఈ జనవరి 19న డాక్టర్ సుచిత్ర, డాక్టర్ నవ్యశ్రీ, డాక్టర్ నవీన్కుమార్ కలసి క్లిష్టమైన సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఉదయం 10.44 గంటలకు ఆడబిడ్డ, 10.46 గంటలకు మగబిడ్డ, 10.47 గంటలకు మరో ఆడబిడ్డకు కవిత జన్మనిచ్చింది. కాగా, మగ బిడ్డ బరువు పెరగడానికి ఎస్ఎన్సీయూలో ఉంచారు. ఈ ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా చేసిన డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ సుచిత్ర, డాక్టర్ నవ్యశ్రీకి ఆసుపత్రి సూపరింటెండెంట్ అభినందనలు తెలిపారు.
రూ. 3 లక్షల ఆపరేషన్ ఫ్రీ!
కాగా, ఇలాంటి సిజేరియన్ ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయాలంటే దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని సూరింటెండెంట్ డాక్టర్ మళ్లీశ్వ తెలిపారు. కానీ జీజీహెచ్లోని గైనిక్ విభాగం వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు చెప్పారు. తద్వారా తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడినట్లు చెప్పారు. వీరిని బుధవారం (జనవరి 28) డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
కడప జిల్లాలో..
గతంలో కడప జిల్లాలో కూడా ఓ మహిళ ఇలానే ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. రాజంపేటకు చెందిన కాశీ విశ్వనాథ్ భార్య ప్రతిమ కాన్పు కోసం కడప రిమ్స్ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ముగ్గురు శిశువులు జన్మించారు. అనంతపురంలో లాగానే.. ఈమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలు, ఒకరు మగ శిశువు జన్మించారు. ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడంతో డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa