ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం

national |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:13 PM

మహారాష్ట్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా 62 ఏళ్ల సునేత్రా పవార్ ప్రమాణం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సునేత్రా పవార్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందడంతో.. ఆయన భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వారి కుమారుడు పార్థ్ పవార్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా ఆమెను నిలబెట్టడం ద్వారా పార్టీపై పట్టు సాధించాలని ఎన్సీపీ వర్గం భావిస్తోంది. అదే సమయంలో శరద్ పవార్ వర్గంతో విలీనంపై చర్చలు కూడా కొనసాగుతుండటం గమనార్హం.


అజిత్ పవార్ మరణం తర్వాత ఇవాళ.. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్రా పవార్‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేత ఛగన్ భుజబల్ సునేత్రా పవార్ పేరును ప్రతిపాదించగా.. ఇతర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సిఫార్సు మేరకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సునేత్రా పవార్‌కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.


బారామతిలో బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌ సహా మొత్తం ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద సమయంలోనే ఎన్సీపీ పగ్గాలు చేపట్టాలని సునేత్రా పవార్‌ను ఆ పార్టీ వర్గాలు ఒప్పించాయి. ఎన్సీపీలో శరద్ పవార్ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే.. అజిత్ పవార్ రాజకీయ వారసురాలిగా సునేత్రా పవార్‌ను నిలబెట్టాలని అజిత్ పవార్ ఎన్సీపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.


అయితే విడిపోయిన ఎన్సీపీ రెండు వర్గాలు.. తిరిగి విలీనం అవుతాయని.. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఇప్పటికే శరద్ పవార్ తేల్చి చెప్పారు. అయితే తాను నేరుగా చర్చల్లో పాల్గొనడం లేదని.. జయంత్ పాటిల్, అజిత్ పవార్ మధ్య ఇప్పటికే డిసెంబర్, జనవరి నెలల్లో చర్చలు జరిగాయని.. ఫిబ్రవరిలో విలీన ప్రక్రియ ఉండగా.. ఈ విషాధం చోటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే సునేత్రా పవార్‌ను మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నియమిస్తున్నారన్న వార్తలపై స్పందించిన శరద్ పవార్.. తనకు ఈ విషయం ముందే తెలియదని స్పష్టం చేశారు.


2024 లోక్‌సభ ఎన్నికల వరకు సునేత్రా పవార్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. ఆ ఎన్నికల్లో బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తన వదిన సుప్రియా సూలేపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె ఎన్సీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పటివరకు రాజ్యసభ ఎంపీగా ఉన్న సునేత్రా పవార్.. అజిత్ పవార్ అకాల మరణంతో నేరుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa