ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షర్, అర్ష్‌దీప్ మ్యాజిక్‌తో భారత్ విజయం,,,,80 పరుగులతో భయపెట్టిన ఫిన్ అలెన్

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 11:03 PM

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా విజయం సాధించింది. 272 పరుగుల హై టార్గెట్ ఛేజింగ్‌లో ఒకానొక దశలో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందా? అనిపించింది. ఫిన్ అలెన్ క్రీజులో ఉన్నంతసేపూ బౌండరీల మోత మోగించి న్యూజిలాండ్‌లో ఆశలు పుట్టించాడు. అక్షర్ పటేల్ బ్రేక్ ఇవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత అర్ష్‌దీప్ ఐదు వికెట్లతో సత్తా చాటి భారత విజయంలో కీలకంగా మారాడు.


 తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సంజూ శాంసన్ మరోసారి విఫలమవ్వగా.. అభిషేక్ 30 పరుగులతో రాణించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 63, ఇషాన్ కిషన్ 103, హార్దిక్ 42 పరుగులు బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.


భారత్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభంలోనే టిమ్ సైఫర్ట్ వికెట్ కోల్పోయింది. 3 బంతుల్లో 5 పరుగులు చేసిన సైఫర్ట్ మొదటి ఓవర్‌లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత నుంచి ఫిన్ అలెన్ - రచిన్ రవీంద్ర కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఫిన్ అలెన్ ఆట తీరుకు భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


ఫిన్ అలెన్ - రచిన్ రవీంద్ర రెండో వికెట్‌కు 48 బంతుల్లోనే ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి అవుటయ్యాడు. అలెన్ అవుటయ్యే సమయానికి న్యూజిలాండ్ జట్టు 9 ఓవర్లకు 117 పరుగులు చేసింది.


అలెన్ అవుటైన తర్వాత కివీస్ స్కోర్ బోర్డు నెమ్మదించడంతో పాటు వికెట్లు కూడా కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ 7, రచిన్ రవీంద్ర 30, మిచెల్ సాంట్నర్ 0, బెవాన్ జాకబ్స్ 7 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ వెంటవెంటనే అవుటవ్వడంతో కివీస్ ఆశలు సన్నగిల్లాయి.


ఒకవైపు వికెట్లు పడుతున్నా డారిల్ మిచెల్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నాడు. 12 బంతులు ఆడిన డారిల్ మిచెల్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేసి అవుటయ్యాడు. మిచెల్ అవుటవ్వడంతో కివీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో ఇష్ సోడి 15 బంతుల్లో 33 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa