క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం ద్వారా అర్హులైన రోగులకు రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఈ పథకం గురించి తెలిపారు. అలాగే దీని పనితీరు, నిధుల వినియోగంపై పూర్తి వివరాలను కూడా వెల్లడించారు.
రూ. 15 లక్షల వరకు ఆర్థిక భరోసా..
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అంబ్రెల్లా స్కీమ్ ఆఫ్ రాష్ట్రీయ ఆరోగ్య నిధిలో భాగంగా హెల్త్ మినిస్టర్స్ క్యాన్సర్ పేషెంట్ ఫండ్ ద్వారా ఈ ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడమే లక్ష్యంగా సర్కారు తీసుకొచ్చిన ఈ పథకం కింద.. నిధులను నేరుగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా రీజినల్ క్యాన్సర్ సెంటర్లకు కేంద్రం విడుదల చేస్తుందన్నారు.
అలాగే ఈ పథకం కింద నిధులు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 27 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాల్లో మాత్రమే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా ఈ పథకం వర్తించదు. అంతేకాకుండా చికిత్స ప్రారంభించడానికి ముందే ఈ దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడితే నిధులు త్వరగా మంజూరు అవుతాయి.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న క్యాన్సర్ రోగులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. అయితే దీన్ని నిరూపించుకోవడానికి వారు తమ రేషన్ కార్డును లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సంబంధిత ఆస్పత్రిలో సమర్పించాల్సి ఉంటుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూ ఉద్యోగులు దీనికి అర్హులు కారు. ఇది మాత్రమే కాకుండా రేడియోథెరపీ, కీమోథెరపీ, సర్జరీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి చికిత్సలకు మాత్రమే ఈ నిధులు వినియోగించవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
రోగి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే దరఖాస్తు ఫారమ్ లభిస్తుంది. అయితే దానిపై చికిత్స చేసే డాక్టర్ సంతకం, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట ధృవీకరణతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలను జతచేయాలి. ఆపై వీటన్నింటినీ అక్కడే ఉన్న నోడల్ ఆఫీసర్కు సమర్పించాల్సి ఉంటుంది. వారు ఈ దరఖాస్తును ఢిల్లీలోని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపుతారు. మరో విషయం ఏటంటే.. రోగి ఆయుష్మాన్ భారత్ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాల కింద కవర్ కాకపోతేనే ఈ ఫండ్ నుంచి సహాయం కోరడం సులభం అవుతుంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రూ. 27.06 కోట్లను వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై 16వ తేదీ వరకే రూ. 9.14 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇలా ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తంగా 134 మంది నిరుపేద రోగులు ఈ పథకం ద్వారా నేరుగా ప్రయోజనం పొందారు. అయితే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఆమోదంతోనే నిధులు విడుదల అవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa