ఆధార్ గుర్తింపు మోసాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకు పైగా వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద బుధవారం పార్లమెంటుకు తెలిపారు. ఆధార్ డేటాబేస్ కచ్చితత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన శుద్ధీకరణ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ సుమారు 134 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. మరణించిన వారి ఆధార్ నంబర్లను దుర్వినియోగం చేసి సంక్షేమ పథకాలను పొందడం, ఇతర మోసాలకు పాల్పడటం వంటివి నిరోధించడానికి ఈ డీయాక్టివేషన్ ప్రక్రియ చాలా అవసరమని మంత్రి పేర్కొన్నారు.ఆధార్ దుర్వినియోగాన్ని తగ్గించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జితిన్ ప్రసాద తెలిపారు. ఇందులో భాగంగా వినియోగదారులు తమ బయోమెట్రిక్స్ను లాక్/అన్లాక్ చేసుకునే సదుపాయం, లావాదేవీల సమయంలో లబ్ధిదారు భౌతికంగా ఉన్నట్లు నిర్ధారించే 'లైవ్నెస్ డిటెక్షన్' ఫీచర్తో కూడిన ఫేస్ అథెంటికేషన్, ఆధార్ సెక్యూర్ క్యూఆర్ కోడ్, ఆఫ్లైన్ ఈ-కేవైసీ వంటివి అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. వినియోగదారుల ప్రధాన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ ఎవరితోనూ పంచుకోదని, డేటాను ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో భద్రపరచడం తప్పనిసరి చేసిందని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa