బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గొప్ప అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా మొత్తం 5,138 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్లో 56 పోస్టులు, తెలంగాణలో 69 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. స్థానిక అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోనే పని చేసే అవకాశం ఉండటం గమనార్హం.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పరిమితి విషయానికి వస్తే, 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు (SC, ST, OBC, PWD) వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అర్హత గల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తేదీ నుండి ఫిబ్రవరి 24వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు నేరుగా వెబ్సైట్లోకి వెళ్లే ముందు, తప్పనిసరిగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాతే పీఎన్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వివరాలను, సర్టిఫికేట్లను జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను బ్యాంక్ యాజమాన్యం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించదు.
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటగా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు, అందులో మెరిట్ సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కి పిలుస్తారు. వీటితో పాటు అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు ఉందో లేదో తెలుసుకోవడానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఎంపికైన వారు నిర్ణీత కాలం పాటు అప్రెంటిస్లుగా శిక్షణ పొందుతూ స్టైఫండ్ పొందుతారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు https://pnb.bank.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa