మరోసారి పాకిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని ఇస్లామాబాద్లో ఓ మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుడులో కనీసం 50 మంది మృతిచెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. నగరంలోని షెహజాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న తర్లై ఇమాంబర్గా వద్ద ఈ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. షియా వర్గానికి చెందిన మసీదు ప్రధాన ద్వారం వద్ద సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు.
ప్రవేశ ద్వారం వద్ద అప్రమత్తమైన గార్డులు ఫిదాయీని ఆపారని, భక్తులు గుమిగూడిన ప్రధాన హాలులోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఇస్లామాబాద్లోని టైమ్స్ నివేదించింది. పేలుడు కారణంగా గేట్ భారీగా ధ్వంసమై, సమీపంలోని భవనాల కిటికీలు పగిలిపోయి, రోడ్డుపై చెల్లాచెదురుగా శిథిలాలు పడి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాంబు పేలుడుతో ఇస్లామాబాద్ నగరం వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిని చికిత్స కోసం పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్స్ (పిమ్స్)కు తరలించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిపై పాకిస్థాన్ ప్రదాన మంత్రి షెహబాజ్ షరీష్ స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడిని ఖండించిన ఆయన.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మూడు నెలల కిందట నవంబరు 11న ఇస్లామాబాద్లో కోర్టు వద్ద జరిగిన బాంబు పేలుడు తర్వాత తాజాగా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa