ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు,,,,రైల్వే జీఎంకు అగంతకుడి లేఖ

national |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:13 PM

వందేభారత్ ట్రైన్లను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు చేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేఖ రైల్వే వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 3వ తేదీన ఒక అజ్ఞాత వ్యక్తి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి పోస్టు ద్వారా ఈ లేఖను పంపాడు. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న నలుగురు జిహాదీ బృందం సభ్యులు వందేభారత్ వెళ్లే రైల్వే ట్రాక్‌లపై బాంబులు అమర్చినట్లు లేఖలో పేర్కొన్నాడు. సుమారు 250 మంది ప్రయాణికులను హతమార్చాలని ఆ టెర్రరిస్టులు కుట్ర పన్నినట్లు ఆ లేఖలో వెల్లడించారు. లేఖలో సదరు అగంతకుడు ఆ నలుగురు జిహాదీ టెర్రరిస్టుల పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం.


ఈ బెదిరింపు లేఖతో అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం, పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా వందేభారత్ ట్రైన్లు, అన్ని రైల్వే స్టేషన్లు, ట్రైన్ ట్రాకుల వెంట బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు విస్తృతం చేశారు. ఇది నిజంగానే ఉగ్రవాద కుట్రనా? లేక ఎవరైనా ఆకతాయిలు కావాలని చేసిన పనా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే అధికారులు ఇప్పటికే గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ట్రైన్లలో కానీ.. స్టేషన్లలో గానీ ఏవైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని వెంటనే 139 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని రైల్వే అధికారులు ప్రయాణికులను కోరుతున్నారు.


ఇక ఇ లెటర్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతే తమ ప్రాథమిక బాధ్యత అని.. ఎవరికీ ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గతంలోనూ ట్రైన్లకు ఆకతాయిలు ఇలాంటి బెదిరింపు లెటర్లు పంపారని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే లెటర్ పంపిన ఆగంతకుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa