ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది,,,,అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 07:36 PM

ఏపీలో అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజీపీ) పాలన సాఫీగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో.. క్షేత్రస్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతిలో జరిగిన బీజేపీ నేతల సమావేశం ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని పార్టీల మధ్య ఉన్న గ్యాప్‌ను ఎత్తిచూపాయి.


ఈ సమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంటోంది.. కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి' అంటూ ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతపై చురకలు అంటించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించాలని.. కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.


కూటమిలో తమ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. బీజేపీ నేతలు కీలక కామెంట్స్. ఏపీలో బీజేపీ మద్దతు లేనిదే తెలుగుదేశం, జనసేన పార్టీలు లేవని.. కూటమికి అసలు పునాదే బీజేపీ అని నేతలు స్పష్టం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నందున.. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని వారు వెల్లడించారు. మనమే కూటమిలో ప్రధానం అనే భావనను క్యాడర్‌లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు.


ఇక తిరుమల కల్తీ నెయ్యి అంశంపై ఆది నారాయణ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 'దొరికారు దొంగలు.. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు' అంటూ ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో జంతుకొవ్వు లేకపోతే.. వైసీపీ నేతల కొవ్వు ఉండి ఉండొచ్చునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం నుండి తప్పించుకోలేరని హెచ్చరించారు.


ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్ ఇతర నేతలు పాల్గొనగా.. ప్రస్తుత ప్రభుత్వంలో బీజేపీ క్యాడర్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదనే ఆవేదన వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం కోసం కష్టపడిన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు పదవుల పంపకాల్లోనూ, ఇతర అవకాశాల్లోనూ ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేడర్ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడాలని.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa