ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. ఏ ఏ ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయంటే

national |  Suryaa Desk  | Published : Sun, Feb 08, 2026, 07:54 PM

భారత్‌పై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవలె 50 శాతం నుంచి సుంకాలు 18 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఇటీవల భారత్-అమెరికా మధ్య కుదిరిన కొత్త తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కారణంగా అమెరికా నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే పలు రకాల ఆహార పదార్థాల ధరలు తగ్గి.. ఊరట కలగనుంది. అయితే దేశ ప్రధాన వ్యవసాయ రంగానికి ఎలాంటి నష్టం కలగకుండా.. కొన్ని వస్తువులపై మాత్రమే సుంకాలను తగ్గించి.. ధరలు దిగివచ్చేలా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అమెరికా సుంకాలు తగ్గించినందుకు బదులుగా.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే కొన్ని ఆహార, పారిశ్రామిక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా తొలగించడం చేయాల్సి ఉంటుంది.


ఏ ఏ ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయి?


డ్రై ఫ్రూట్స్


అమెరికా నుంచి భారత్‌లోకి దిగుమతి అయ్యే బాదం, పిస్తా, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ధరలు దిగి రానున్నాయి.


పండ్లు


యాపిల్స్, తాజా పండ్లు, ప్రాసెస్ చేసిన పండ్లపై దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి. అయితే భారతదేశ రైతులను కాపాడేందుకు వీటిపై కనీస దిగుమతి ధర రూల్ మాత్రం కొనసాగుతుంది.


సోయాబీన్ ఆయిల్


భారత్‌లో వంట నూనెల అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నందున.. అమెరికా నుంచి వచ్చే సోయాబీన్ ఆయిల్‌పై భారత్ సుంకాలను తగ్గించింది.


పశువుల దాణా


పశువులు, కోళ్ల మేతలో వాడే ప్రోటీన్ పదార్థాలు, ఎర్ర జొన్నలపై దిగుమతి సుంకాలు తగ్గుతాయి. దీనివల్ల దాణా తయారీ ఖర్చు తగ్గి.. పరోక్షంగా దానిపై ఆధారపడే పలు రంగాలకు భారీ ఊహట కలగనుంది.


వైన్, స్పిరిట్స్


అమెరికన్ వైన్, ఇతర స్పిరిట్‌ల ధరలు కూడా తగ్గనున్నాయి. కనీస దిగుమతి ధర కొనసాగుతున్నప్పటికీ.. భారత మార్కెట్లో ఇలాంటి డ్రింక్స్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.


కొన్ని వస్తువులపై పాత సుంకాలే


అయితే భారతదేశంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడం, పూర్తిగా తొలగించడం వల్ల మన దేశ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అనేక భయాందోళనలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ సర్కార్ అలర్ట్ అయింది. అత్యంత సున్నితమైన వ్యవసాయ రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చూసేందుకు ఆయా ఉత్పత్తులపై పాత సుంకాలే కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.


ప్రధాన ధాన్యాలు


గోధుమలు, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, బార్లీ, ఓట్స్‌ వంటి ఉత్పత్తులు ఈ వాణిజ్య ఒప్పందం నుంచి మినహాయించారు. దీనివల్ల వీటికి పాత సుంకాలే అమలు కానున్నాయి.


పాల ఉత్పత్తులు


పాలు, వెన్న, నెయ్యి, పెరుగు, వెన్న నూనె వంటి ఉత్పత్తులపై పూర్తి రక్షణ కల్పించారు.


మాంసం, కూరగాయలు


చికెన్, ఇతర మాంసాలు, బంగాళాదుంపలు, బఠానీలు, చిక్కుళ్లు, పుట్టగొడుగులు వంటి వాటిపై పాత సుంకాలే అమలు కానున్నాయి.


మరోవైపు.. తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్‌లో భాగంగా అమెరికా కూడా కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఇందులో టెక్స్‌టైల్స్, లెదర్, ఫార్మాస్యూటికల్స్, విమాన విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి. వీటివల్ల భారతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) భారీగా లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa