ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్ అమౌంట్ డిడెక్ట్ అవుతూ ఉంటుంది. చాలా మంది దీనిని కేవలం పొదుపుగా మాత్రమే భావిస్తారు. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈ పొదుపుతో పాటు మరో కీలకమైన హిడెన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇది చాలామందికి ఇప్పటికీ తెలియకపోవచ్చు. మరి ఆ ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.EPFO తన చందాదారులకు పెన్షన్ లేదా పీఎఫ్ పొదుపు మాత్రమే కాకుండా, రూ.7 లక్షల వరకు ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ బీమా ప్రయోజనం EDLI (Employees’ Deposit-Linked Insurance) పథకం కింద లభిస్తుంది. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఉద్యోగి నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియంగా వసూలు చేయరు. EDLI బీమాకు సంబంధించిన మొత్తం ప్రీమియాన్ని యజమాని లేదా సంస్థే చెల్లిస్తుంది. మీ పీఎఫ్ ఖాతా ప్రారంభమైన వెంటనే, మీరు ఆటోమేటిక్గా ఈ బీమా పథకంలో చేరినట్లే. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగంలో ఉన్న సమయంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, ఉద్యోగి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.అయితే ఈ బీమా మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారు అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. బీమా కవర్ గణన పూర్తిగా ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది. నిబంధనల ప్రకారం, ఉద్యోగి గత 12 నెలల సగటు ప్రాథమిక జీతం మరియు డియర్నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా ఈ మొత్తం లెక్కిస్తారు. బీమా కవర్ మొత్తం సగటు జీతానికి 35 రెట్లు ఉండగా, దీనికి అదనంగా రూ.1.75 లక్షల బోనస్ కూడా జోడిస్తారు. EPFO గరిష్ట జీత పరిమితిని రూ.15,000గా నిర్ణయించింది. ఈ లెక్కన రూ.15,000ను 35తో గుణిస్తే రూ.5.25 లక్షలు వస్తాయి. దీనికి రూ.1.75 లక్షల బోనస్ కలిపితే మొత్తం బీమా మొత్తం రూ.7 లక్షలకు చేరుకుంటుంది. ఇది ఈ పథకం కింద లభించే గరిష్ట ప్రయోజనం.ఇప్పుడు ఈ బీమాను ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యోగంలో ఉన్న సమయంలో మరణిస్తే, వారి నామినీ లేదా చట్టపరమైన వారసుడు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ క్లెయిమ్ ప్రక్రియను EPFO మరింత సులభతరం చేసింది. నామినీ EDLI ఫారం 5 IF ను పూర్తి చేసి సంబంధిత EPFO ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించాలి. క్లెయిమ్తో పాటు మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పుట్టిన తేదీ రుజువు వంటి అవసరమైన పత్రాలను జత చేయాలి. ఉద్యోగి కొంతకాలం జీతం లేకుండా ఉన్నా (నాన్-కంట్రిబ్యూటరీ పీరియడ్), క్లెయిమ్ తిరస్కరించకుండా ఉండే విధంగా నిబంధనల్లో వెసులుబాటు కల్పించారు. సాధారణంగా 30 రోజుల్లోపు క్లెయిమ్ను పరిష్కరించేందుకు విభాగం ప్రయత్నిస్తుంది. ఏదైనా ఆలస్యం జరిగితే, EPFO క్లెయిమ్ దారునికి ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ డబ్బుపై మొదటి హక్కు పీఎఫ్ ఖాతాలో నమోదు చేసిన నామినీకి ఉంటుంది. నామినీ లేకపోతే, జీవిత భాగస్వామి (భర్త లేదా భార్య), 25 సంవత్సరాల లోపు కుమారులు లేదా పెళ్లి కాని కుమార్తెలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే ప్రతి పీఎఫ్ ఖాతాదారుడు తప్పనిసరిగా ఇ-నామినేషన్ పూర్తి చేయడం చాలా అవసరం. అలా చేస్తే, మీరు లేని సమయంలో మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు ఉండవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa