ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారిక్ రెహెమాన్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 08:55 PM

బంగ్లాదేశ్‌లో తాజాగా జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు.


తారిక్ రెహమాన్‌కు మోదీ శుభాకాంక్షలు..


బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీ సాధించిన ఘన విజయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. "బీఎన్‌పీని అద్భుత విజయం దిశగా నడిపించిన తారిక్ రెహమాన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం" అని ప్రధాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన, ప్రగతిశీలమైన, అందరినీ కలుపుకుపోయే బంగ్లాదేశ్‌కు భారత్ ఎప్పుడూ తన మద్దతును కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాల కోసం తారిక్ రెహమాన్‌తో కలిసి పని చేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.


212 స్థానాలతో బిఎన్‌పి క్లీన్ స్వీప్


మొత్తం 299 పార్లమెంట్ స్థానాలు ఉన్న బంగ్లాదేశ్‌లో మ్యాజిక్ ఫిగర్ 150 కాగా.. బీఎన్‌పీ ఏకంగా 212 స్థానాల్లో జయభేరి మోగించింది. ఒకప్పటి మిత్రపక్షం, ప్రస్తుత ప్రత్యర్థి జమాత్-ఏ-ఇస్లామీ కేవలం 70 స్థానాలకే పరిమితమై తన ఓటమిని అంగీకరించింది. దీంతో తారిక్ రహ్మాన్ బంగ్లాదేశ్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. తన తల్లి, మాజీ ప్రధాని జియా ఖలీదా మరణం తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన రహ్మాన్.. అనూహ్య రీతిలో పార్టీని విజయతీరాలకు చేర్చారు.


గతంలో షేక్ హసీనా ప్రభుత్వంతో భారత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఆమె అధికారానికి దూరమై భారత్‌లో ఆశ్రయం పొందుతుండటంతో ఇరు దేశాల మధ్య కొంత దౌత్యపరమైన గ్యాప్ వచ్చింది. ఇప్పుడు బీఎన్‌పీ అధికారంలోకి రావడంతో ఈ సంబంధాలు మళ్లీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో బీఎన్‌పీతో భారత్‌కు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పార్టీగా భారత్ దానిని గౌరవిస్తోంది. జియా ఖలీదా అనారోగ్యంతో ఉన్న సమయంలో ప్రధాని మోదీ స్పందించిన తీరు కూడా ఇరు పక్షాల మధ్య సయోధ్యకు పునాది వేసింది.


దీంతో సరిహద్దు భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ, నదీ జలాల పంపిణీ వంటి కీలక అంశాలపై బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో భారత్ చర్చలు జరపాల్సి ఉంది. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శిస్తే.. దక్షిణాసియాలో ప్రాంతీయ స్థిరత్వం మరింత మెరుగవుతుంది. మోదీ సందేశం ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా ఒక సానుకూల సంకేతంగా దౌత్య నిపుణులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa