ప్రస్తుతం ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో మనల్నే నమ్ముకున్న కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లాంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ప్లాన్లలో బీమా ప్రీమియంలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఏ బీమాకు అయినా కనీసం రూ.500 చెల్లించాల్సిందే. కానీ జస్ట్ 45 పైసలతో రూ.10 లక్షల ప్రమాద బీమా పొందే ఛాన్స్ ఉందనే విషయం తెలుసా..? కాకపోతే ఈ ఇన్సూరెస్ పథకం అందరికీ వర్తించదు. కేవలం ట్రైన్లలో అది కూడా ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే లభిస్తుంది.
ట్రన్ టికెట్లు బుక్ చేసే సమయంలో చాలా మంది ఇన్సూరెన్స్ ఆప్షన్ పట్టించుకోకుండా వదిలేస్తారు. అదిసరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. IRCTC ఆన్లైన్ టికెట్ బుకింగ్ సమయంలో ఆప్షనల్గా అందిస్తున్నా కచ్చితంగా ట్రైన్ ప్రయాణం చేసే వారందరూ తీసుకోవాలని చెబుతున్నారు. రైల్వే e-టికెట్ బుక్ చేస్తున్నప్పుడు 'ఆప్ట్ ఫర్ ఇన్సూరెన్స్' అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ను గనుక ఎంచుకుంటే ప్రతి ప్రయాణికుడు రూ.45 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ కన్ఫార్మ్ అయిన తర్వాత బీమా పాలసీ వివరాలు ఫోన్కు మెసేజ్ లేదా ఈమెయిల్ ద్వారా ప్రయాణికులకు అందుతాయి. ప్రయాణికులు సదరు బీమా కంపెనీ వెబ్సైట్లో నామినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నామినీ నమోదు చేయటం అనేది తప్పనిసరి కాకపోయినా.. క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే నమోదు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈ ఇన్సూరెన్స్ ట్రైన్ ప్రయాణ సమయంలో ప్రమాదం లేదా అనుకోని ఘటన జరిగినప్పుడు వర్తిస్తుంది. ప్రమాదంలో మరణించినా లేదా పూర్తి శాశ్వత వైకల్యం కలిగినా బీమా సంస్థ నుంచి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.7.5 లక్షల వరకు, గాయాల కారణంగా హాస్పిటల్ ఖర్చులకు రూ.2 లక్షల వరకు బీమా కవరేజ్ వర్తిస్తుంది. డెడ్ బాడీ రవాణా ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10 వేల వరకు సాయం అందుతుంది. అయితే ఈ సదుపాయం ఇండియన్స్కు మాత్రమే వర్తిస్తుంది. బెర్త్ లేకుండా ప్రయాణించే ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇది వర్తించదు.
టికెట్ కన్ఫార్మ్డ్, ఆర్ఏసీ లేదా పార్ట్ కన్ఫార్మ్డ్ టికెట్లకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుంది. కౌంటర్ టికెట్లకు అంటే రైల్వే స్టేషన్లలో తీసుకొని టికెట్లకు ఈ సదుపాయం వర్తించదు. ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత బీమా కంపెనీని నేరుగా సంప్రదించవచ్చు. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత, సర్టిఫికెట్స్ పరిశీలించి సదరు కంపెనీ బీమా మెుత్తం చెల్లిస్తుంది. ట్రైన్ ప్రయాణికులు టికెట్ బుక్ చేసే సమయంలో మర్చిపోకుండా ఈ ఆప్షన్ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa