మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2014లో జారీ చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని (జీవో) అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. పదేళ్లకు పైగా చట్టపరంగా అమలులో లేని ఈ రిజర్వేషన్లను, ఇప్పుడు అధికారిక రికార్డుల నుంచి తొలగించారు.2014లో అప్పటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ద్వారా ముస్లింలను స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్-ఏ (ఎస్బీసీ-ఏ) కేటగిరీ కింద చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే, దీనిపై బాంబే హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా ఆ ఆర్డినెన్స్ను శాసనసభలో చట్టంగా మార్చకపోవడంతో అది వాటంతట అదే మురిగిపోయింది. సుప్రీంకోర్టు కూడా ఈ కోటాను పక్కన పెట్టింది.న్యాయస్థానాల జోక్యం, ఆర్డినెన్స్ గడువు ముగియడంతో ఈ రిజర్వేషన్లు దశాబ్ద కాలంగా అమలులో లేవు. అయినప్పటికీ, పాత జీవో ప్రభుత్వ రికార్డుల్లో కొనసాగుతూ వచ్చింది. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో పాత జీవోను, దానికి సంబంధించిన అన్ని సర్క్యులర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ కేటగిరీ కింద ఎలాంటి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయరాదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa