సాధారణంగా ఎనిమిదేళ్ల వయసున్న పిల్లలు స్కూల్ హోంవర్క్ చేస్తూనో లేదా వీడియో గేమ్స్తో ఆడుతూనో బిజీగా ఉంటారు. కానీ 8 ఏళ్ల వయసున్న రణ్వీర్ సింగ్ సచ్దేవా కథే మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026'లో స్టేజ్పైకి చిన్నారి నడుచుకుంటూ వస్తుంటే అందరూ అతడెవరో అనుకున్నారు. కానీ అతను మైక్ పట్టుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం మధ్య ఉన్న సంబంధం గురించి అనర్గళంగా మాట్లాడుతుంటే టెక్ దిగ్గజాలంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈక్రమంలోనే ఆ బాల మేధావి ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడే అతడు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రోగ్రామర్గా గుర్తింపు పొందిన రణ్వీర్ సింగ్ అని తెలుసుకుని షాకయ్యారు.
అబ్బురపరిచే రణ్వీర్ ప్రయాణం..
2017లో జన్మించిన రణ్వీర్ సింగ్ సచ్దేవా.. కేవలం మూడు ఏళ్ల వయసులోనే వర్గాలను, ఘనాలను నోటితో లెక్కించేవాడు. ఐదేళ్లకే ఆపిల్ 'స్విఫ్ట్' ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా కుక్ స్వయంగా రణ్వీర్ను కాలిఫోర్నియాలోని ఆపిల్ హెడ్ క్వార్టర్స్కు ఆహ్వానించగా.. అక్కడికి వెళ్లి అనేక మందికి సుపరిచితుడిగా మారాడు. అప్పటి నుంచి రణ్వీర్ వెనక్కి తిరిగి చూడలేదు.
అంతర్జాతీయ వేదికలపై అరుదైన రికార్డులు..
ఆరేళ్ల వయసులో ఏషియాలోనే అత్యంత పిన్న వయస్కుడైన టెడ్-ఎక్స్ వక్తగా రణ్వీర్ సింగ్ సచ్దేవా రికార్డు సృష్టించాడు. 2024లో అదే ఆరేళ్ల వయసులో యూఎన్ జనరల్ అసెంబ్లీకి హాజరైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. అంతేకాకుండా "ఆర్ యూ బార్న్ విత్ ఏఐ " పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రచించి అందరనీ అబ్బురపరిచేలా చేశాడు. ప్రస్తుతం ఈ పుస్తుకం అమెజాన్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా అతడు నాలుగు ఏళ్ల వయసులోనే రూపొందించిన మార్స్ మిషన్ ప్రాజెక్ట్ నాసా వెబ్సైట్లో కూడా ప్రదర్శితమైంది. గూగుల్ రెస్పాన్సిబుల్ ఏఐ సర్టిఫికేషన్ పొందిన రణ్వీర్.. ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ సంస్థలకు అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?
ఇవి మాత్రమే కాకుండా ఆరేళ్ల వయసులోనే రణ్వీర్ సింగ్ సచ్దేవా రాసిన కేంబ్రిడ్జ్ అసెస్మెంట్స్ ఫలితాలు.. 14 ఏళ్ల విద్యార్థి స్థాయికి సమానంగా వచ్చాయి. ఇది చూసిన ప్రొఫెసర్లు అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ చిన్నారి ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో 'మెషీన్ లెర్నింగ్' కోర్సును అభ్యసిస్తున్నాడు. అంతేకాకుండా సొంతంగా ఏఐ చాట్బాట్ను కూడా రూపొందించాడు. భారత్ ఆర్థిక వ్యవస్థలో ఏఐ పాత్ర, గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ అక్షరాస్యతను పెంచడమే తన లక్ష్యమని ఈ చిన్నారి చెబుతుంటే.. మన దేశాధినేతలంగా గర్వంతో ఉప్పొంగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa