ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తును నాశనం చెయ్యాలని చూస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 12:04 PM

తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టులకు ఉరి బిగిస్తున్నారని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందాలను ఎండగట్టారు.  తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కోసమే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారని చంద్రశేఖర్ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం చెప్పిన మాటలపై చంద్రబాబు ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాయలసీమను శాశ్వతంగా కరువులో ఉంచి, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ‘బ్రీఫ్డ్ మీ బ్రదర్’తో లాలూచీ పడ్డారని మండిపడ్డారు.తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని తోడుకుపోతుంటే, ఏపీకి కేవలం 0.63 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండటం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. పగలు ప్రజల ముందు బీజేపీతో బంధం ఉన్నట్టు నటిస్తూ, రాత్రికి కాంగ్రెస్‌తో ‘హాట్ లైన్’ చర్చలు జరపడం బాబు నైజమన్న చంద్రశేఖర్... ఏపీలో కాంగ్రెస్‌తో విరోధులుగా ఉంటూ, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతోనే అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసు పత్రాలు తగలబడ్డాయన్న వార్తల వెనుక ఉన్న మర్మమేమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ‘క్యాట్ వాక్’లు చేస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ఘనత వైయస్సార్ కుటుంబానిదేనని... చంద్రబాబుది శంకుస్థాపనల డ్రామా మాత్రమేనని స్పష్టం చేశారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా వైయస్సార్, వైయస్ జగన్ కృషి కనిపిస్తుందని చంద్రశేఖర్ తెలిపారు. పుట్టిన గడ్డ  సీమకైనా, పిల్లనిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని.. ఇప్పటికైనా తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయవద్దని చంద్రశేఖర్ హితవు పలికారు. మరోవైపు రాష్ట్ర చరిత్రలో శాసనసభ వ్యవహారాలకు నేడు ఒక దుర్దినమని, మండలి చైర్మన్ సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa