ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముదురుతున్న యుద్ధం,,, రంగంలోకి ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 07:26 PM

పశ్చిమాసియాలో మారుతున్న యుద్ధ సమీకరణలు, ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరమైన ముందడుగు వేశారు. ఓవైపు ఇజ్రాయెల్ ప్రధానితో, మరోవైపు యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడటమే కాకుండా.. స్వయంగా భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీని నిర్వహించి దేశ భద్రతపై దిశానిర్దేశం చేశారు.


నెతన్యాహుకు ఫోన్ చేసి మరీ విజ్ఞప్తి..


ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "యుద్ధం వల్ల సామాన్య పౌరుల భద్రతకు ముప్పు కలగకూడదు. పౌరుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. అలాగే ఈ ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది" అని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.


యూఏఈకి భారత్ సంఘీభావం..


అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు యూఏఈపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడిన మోదీ.. ఈ క్లిష్ట సమయంలో భారత్ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూఏఈలో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయుల భద్రతపై కూడా ఆయన ఆరా తీశారు. తమ పౌరులను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు యూఏఈ అధ్యక్షుడికి షేక్ మహమ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


దేశ భద్రతపై సమీక్ష


యుద్ధం వల్ల భారత్‌పై పడే ప్రభావంపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఆదివారం రాత్రి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమావేశాన్ని నిర్వహించారు. దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై నిర్ణయాలు తీసుకునే ఈ అత్యున్నత స్థాయి కమిటీలో.. ఇంధన ధరలు, విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు ప్రణాళికలు, రక్షణ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పశ్చిమాసియాలో ఏ చిన్న మార్పు వచ్చినా అది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది కాబట్టి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa