విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కుంభాభిషేకం కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దుర్గగుడిలో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మార్చి ఆరో తేదీ నుంచి దుర్గగుడిలో కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మార్చి 6, 7, 8 తేదీల్లో కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ విమాన గోపురాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. వేద మంత్రాలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
మరోవైపు 2012 సంవత్సరంలో విజయవాడ దుర్గగుడిలో కుంభాభిషేకం జరిగింది. అయితే ప్రధాన రాజగోపురం ప్రతిష్ట సందర్భంగా రెండేళ్లలోపే.. అంటే 2014లో మళ్లీ కుంభాభిషేకం నిర్వహించారు. 12 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కుంభాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న విగ్రహాలు, గోపురాలకు పునరుజ్జీవనం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా పవిత్ర నదులు, సముద్రాల నుంచి జలాలను సేకరించి ఆలయంలోని యాగశాలలో మూడురోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆ జలంతో గోపురాలు, కలశాలకు అభిషేకం నిర్వహిస్తారు.
కుంభాభిషేకం.. ఏ రోజున ఏం చేస్తారంటే..
మార్చి ఆరో తేదీన యాగశాలలో ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ నిర్వహిస్తారు. తర్వాత పుణ్యాహవచనం, దీక్షాధారణ, పంచగవ్వ ప్రాశనం, అఖండ దీపారాధన వంటి కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలతో పాటుగా.. మూలమంత్ర హవనములు, హారతి ఉంటుంది. రాత్రి 7 మంత్ర పుష్పం కార్యక్రమం ఉంటుంది.
మార్చి ఎనిమిదో తేదీ ఉదయం 8 గంటలకు అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠ పూజలు ఉంటాయి. మధ్యాహ్నం 12గంటలకు మూలమంత్ర హవనములు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ప్రదోషకాల పీఠపూజలు, హారతితో పాటుగా 7 గంటలకు మంత్ర పుష్పం ఉంటుంది. ఆఖరి రోజైన మార్చి ఎనిమిదో తేదీ ఉదయం మంటప పూజలు, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి ఉదయం 9.34 నిమిషాలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కుంభాభిషేకం నిర్వహిస్తారు. మరోవైపు కుంభాభిషేకం కార్యక్రమానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. ఇది అంతర్గత కార్యక్రమమని.. యాగశాలలోకి భక్తులను అనుమతించమని క్లారిటీ ఇచ్చారు. అయితే దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa