ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు?.. అసలెవరీ మొజ్తబా ఖమేనీ

international |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:43 PM

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ.. ఇరాన్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వారసుడిగా, ఖమేనీ కుమారుడు 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నిక అయినట్లు తెలుస్తోంది. 88 మంది సభ్యులతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' వర్చువల్ సమావేశం ద్వారా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.


ఐఆర్‌జీసీ ఒత్తిడి.. వారసత్వానికే మొగ్గు


ఇరాన్‌లోని శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (ఐఆర్‌జీసీ) ఒత్తిడి మేరకే ఈ నియామకం జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడానికి భద్రతా వ్యవస్థలతో సన్నిహిత సంబంధాలున్న మొజ్తబా సరైన వ్యక్తి అని ఐఆర్‌జీసీ గట్టిగా వాదించినట్లు సమాచారం. నిజానికి గతంలో ఇరాన్ నాయకత్వం వారసత్వ పాలనను తీవ్రంగా విమర్శించేది. కానీ ఇప్పుడు యుద్ధం వంటి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో.. పాత సిద్ధాంతాలను పక్కనపెట్టి ఖమేనీ కుమారుడికే పగ్గాలు అప్పగించాల్సి వచ్చింది.


తెర వెనుక నుంచి నేరుగా పీఠంపైకి..


మొజ్తబా ఖమేనీ గతంలో ఏ ప్రభుత్వ పదవిని నిర్వహించనప్పటికీ.. తెర వెనుక ఉండి ఇరాన్ అధికార యంత్రాంగాన్ని శాసిస్తున్నారని చాలా కాలంగా ప్రచారం ఉంది. 2019లోనే అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది. అయితే ఆయన కేవలం మధ్యస్థ స్థాయి మతాధికారే అయినప్పటికీ.. ఐఆర్‌జీసీ, ఇంటెలిజెన్స్ విభాగాలపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. 1989లో అలీ ఖమేనీ బాధ్యతలు చేపట్టాక.. 37 ఏళ్ల తర్వాత ఇరాన్ నాయకత్వంలో జరుగుతున్న రెండో మార్పు ఇదే కావడం గమనార్హం.


సవాళ్లతో కూడిన బాధ్యత..


ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు తన కుటుంబ సభ్యులను (తల్లి, భార్య, కుమార్తె) కోల్పోయిన పుట్టెడు దుఃఖం మధ్య మొజ్తబా బాధ్యతలు చేపట్టారు. ఆయన నియామకం పట్ల ఇరాన్‌‌లోని కొన్ని మతపరమైన వర్గాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కరుడుగట్టిన సిద్ధాంతకర్త అవసరమని ఐఆర్‌జీసీ భావిస్తోంది. మొజ్తబా నాయకత్వంలో ఇరాన్ అణు కార్యక్రమం, విదేశాంగ విధానం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa