ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడ్డూ తయారీకి నెయ్యి కొరత లేదు.. : టీటీడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2026, 07:52 PM

తిరుమలలో నెయ్యి నిల్వలు తగ్గిపోయాయనే ప్రచారం అవాస్తవమని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూ తయారీ కోసం కావాల్సినంత నెయ్యి నిల్వలు ఉన్నాయని టీటీడీ వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద నెయ్యి నిల్వలు సరిపడా లేవంటూ, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందంటూ సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని టీటీడీ పేర్కొంది.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కావాల్సిన నెయ్యి కొనుగోలు విధానం మూడంచెలుగా జరుగుతుందని టీటీడీ తెలిపింది. నెయ్యి సరఫరా కోసం ఒకే సంస్థ మీద ఆధారపడమని.. మూడు వేర్వేరు సంస్థల నుంచి నెయ్యి సరఫరా జరుగుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి భక్తులకు పంపిణీ చేసేందుకు 7 లక్షల వరకూ లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, తిరుమల శ్రీవారి కైంకర్యాలు, లడ్డూ తయారీకి ఆంటకం కలుగుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని శ్రీవారి భక్తులను టీటీడీ కోరింది.


మరోవైపు పుణె నుంచి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం వద్ద బోల్తాపడింది. జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం చిత్రావతి వంతెన వద్ద నెయ్యి ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని నెయ్యి మొత్తం నేలపాలైంది. నెయ్యి ట్యాంకర్‌లో సుమారుగా 21వేల లీటర్ల నెయ్యి ఉండగా.. ప్రమాదం జరగటంతో కేవలం ఐదు వందల లీటర్ల నెయ్యి మాత్రమే ట్యాంకర్‌లో మిగిలింది. నెయ్యి ట్యాంకర్ బోల్తా పడిన విషయం తెలిసి స్థానికులు బిందెలు, బకెట్లతో ట్యాంకర్ మొత్తం ఖాళీ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి 21వేల లీటర్లల కేవలం 500 లీటర్ల నెయ్యి మాత్రమే మిగిల్చినట్లు తెలిసింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


మరోవైపు తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా పడడం స్వామివారు కన్నెర్ర చేయడమేనంటూ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. తిరుమలలో నెయ్యి నిల్వలు తగ్గిపోయాయని.. ఇప్పటివరకు ఉన్న స్టాక్ రెండు రోజులకు మాత్రమే సరిపోతుందని.. అంత నిర్లక్ష్యంగా టీటీడీ ఉంటోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేశారు. ఈ నేపథ్యంలో లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు తమ వద్ద ఉన్నాయని.. భక్తులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa