టెక్నాలజీతో దూసుకెళ్తన్న ప్రపంచంలో ప్రేమ, కులాంతర వివాహాలు యువత ప్రాణాలను తీస్తున్నాయి. కొత్త జంటలకు అండగా ఉండాల్సిన వాళ్లు అనంతలోకాలకు పంపతున్నారు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తూ చంపేస్తున్నారు. తమ కొడుకును ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో అత్తమామలు కోడలును చిత్రహింసలు పెట్టి చంపిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జై భవానీ కాలనీలో రామచంద్ర పాటిల్, సునీ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి బాదల్ అనే కుమారుడు ఉన్నాడు. బాదల్ ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో అపురూపంగా చూసుకున్నారు. బాదల్ చదువుకునే కాలేజీలో రియా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరు మనసులు కలవడంతో వారు ఇంట్లో చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత రియాను తీసుకుని బాదల్ తన ఇంటికి వెళ్లగా తల్లిదండ్రులు రానివ్వలేదు. బాదల్ బతిమిలాడటంతో వారు ఒప్పుకున్నారు. కానీ అప్పటి నుంచే అసలు కథ మొదలైంది.
ప్రతిరోజు రియాను అత్తింటి వారు వేధింపులకు గురి చేసేవారు. తమ కొడుక్కి ఘనంగా పెళ్లి జరిపిద్దామనుకుంటే ప్రేమ వివాహం చేసుకుని కట్నం లేకుండా చేశాడని, దీనికి అంతటికి నీవే కారణమంటూ ప్రతిరోజు రియాను ఇబ్బంది పెట్టేవారు. పెళ్లి కాక ముందు రియాకు గుండె ఆపరేషన్ కావడంతో అప్పుడప్పుడు అనారోగ్యానికి గురయ్యేది. ఈ విషయాలన్నింటితో కోపం పెంచుకున్న వారు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం బాదల్ బయటకు వెళ్లిన సమయంలో రియాను తీవ్రంగా కొట్టి గొంతునులిమి చంపారు. అనంతరం ఫ్యాన్ కు ఉరేసారు. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని నమ్మించారు. అయితే పోస్టుమార్టంలో హత్య జరిగిందని తెలుస్తుంది. అత్తమామలను పోలీసులు విడివిడిగా విచారించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారు. లోతుగా విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కొడుకు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్లే కోడలును చంపినట్లు తెలిపారు. వారిద్దరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa