ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబ‌రు 2వ తేదీన గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2019, 05:20 AM

రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ నుంచి కొత్తగా ప్రవేశ పెట్టనున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపనుంది. చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో విన్నవించిన 72 గంటల్లోనే సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఉద్యోగులు, సిబ్బంది నియామక ప్రక్రియ సైతం పూర్తికావచ్చింది. ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన ప్రజల కనీస ఇబ్బందులు, సమస్యలు, వినతులు గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన వివిధ సర్టిఫికెట్లు వెంటనే అందనున్నాయి. గ్రామంలో రైతుల సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించి అవసరమైన సేవలు అందించే అవకాశాలు మెరుగు పడతాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న 13,065 గ్రామ పంచాయతీలను 11,158 గ్రామ సచివాలయ కేంద్రాలుగా వర్గీకరించి కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఈ భవనాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన రంగులతో అలంకరిస్తున్నారు. కార్యాలయ భవనంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో, ఆ గ్రామం పేరు రాసేలా ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ప్రజల నుంచి అందిన వినతుల మేరకు పింఛన్లు, రేణషన్ కార్డులు, లోన్ ఎలిజిబులిటీ కార్డుల వంటివి మంజూరు అనంతరం సచివాలయంలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లాలోని మొత్తం సచివాలయాలకు అవసరమైన సామగ్రిని ఏకమొత్తంగా కొనుగోలు చేస్తారు. ఈ మేరకు 13 జిల్లాలకు కలిపి ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు విడుదల చేసింది. జిల్లాల్లో కొనుగోలు టెండర్ల ప్రక్రియ సాగుతోంది. కాగా, అక్టోబరు 2వ తేదీన మండలంలో కనీసం ఒక గ్రామంలో గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలుత రాష్ట్ర వ్యాప్తంగా 661 గ్రామ సచివాలయ భవనాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ఆయా కార్యాలయాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa