ఆంధ్రప్రదేశ్లో సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న కడప జిల్లా జమ్మలమడుగు మళ్లీ తెరపైకి రానుంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులు ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, మరో సమీప బంధువు తాతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
త్వరలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి జగన్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్కు భూమి పూజ చేయనున్నారు.
ఇక్కడ జరిగే బహిరంగసభ వేదిక వద్దే ఆది సోదరులు వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి సోదరులు మొదటి నుంచి ఒకే పార్టీలో కొనసాగుతున్నారు.. సోదరులు వైసీపీలోకి వెళ్తే ఆది రాజకీయంగా ఏకాకి కానున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సీఎం జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు.
ఎన్నికల అనంతరం రాజకీయ భవిష్యత్ దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రకటించారు కూడా. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అనంతరం సోమవారం కాషాయి కండువా కప్పుకున్నారు.
న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన అనంతరం ఆదినారాయణ రెడ్డి జగన్ పై ఎటాక్ స్టార్ట్ చేశారు.
దేశాభివృద్ధి ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదన్న ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పేదొకటి చేసేదొకటి అంటూ విమర్శలు చేశారు. అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ను అందరూ వ్యతిరేకించినా జగన్ మొండిగా ముందుకెళ్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa