ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబ‌రు 26న శ్రీవారి ఆలయం మూసివేత!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2019, 06:53 PM

ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. జనవరి, జులై నెలలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. ఈ ఏడాదిలో చిట్టచివరి సూర్యగ్రహణం డిసెంబరు 26న గురువారం సంభవిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనువిందు చేయనుంది. జ్యోతిషం ప్రకారం ఇది కేతుగ్రస్త కంకణాకార గ్రహణం. ఇది మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో సంభవిస్తుంది. గ్రహణం రోజున ఆగమశాస్త్రం అనుసరించి ఆలయాలను మూసివేస్తారు. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. డిసెంబ‌రు 26న గురువారం ఉదయం 8.08 గంట‌ల నుంచి ఉదయం 11.11 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందు అంటే డిసెంబ‌రు 25న బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం త‌లుపులు మూసివేస్తారు. తిరిగి డిసెంబ‌రు 26న గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆలయం తెరవనున్నారు. అనంతరం ఆలయశుద్ధి నిర్వహించి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు భ‌క్తుల‌ను దర్శనానికి అనుమతిస్తారు. తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలు, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కాణిపాకం వినాయక ఆలయాలనూ బుధవారం రాత్రి మూసివేసి గురువారం మధ్యాహ్నం తెరవనున్నారు. బుధవారం రాత్రి 11 గంటల తర్వాత శ్రీవారి అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, 2వ సత్రాలు, ఆసుపత్రులు, శ్రీపద్మావతి విశ్రాంతి గృహం క్యాంటీన్‌లో అన్నప్రసాద వితరణ ఉండదు. గురువారం మధ్యాహ్నం నుంచి యధావిధిగా అన్నప్రసాద వితరణ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa