ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి ఆ రూట్లో కొత్తగా రైలు.. టైమింగ్స్, స్టాపింగ్స్ పూర్తి వివరాలివే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 07:53 PM

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా మరో రైలు నడపనుంది. గుంతకల్లు నుంచి నంద్యాల మీదుగా మార్కాపురం రోడ్ స్టేషన్ వరకూ కొత్త ప్యాసింజర్ రైలును నడపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్యాసింజర్ రైలు ప్రతి రోజూ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయితే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై క్లారిటీ లేదు. గుంతకల్లు - మార్కాపురం మధ్య డైలీ ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపిందని గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. త్వరలో రైలు ప్రారంభ తేదీ ఖరారు కానుందని తెలిపారు.


గుంతకల్లు - మార్కాపురం రోడ్ ప్యాసింజర్ రైలు సర్వీస్ వివరాలు


మరోవైపు గుంతకల్లు - మార్కాపురం ప్యాసింజర్ రైలు(57407) ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలు నంద్యాల రైల్వే స్టేషన్‌కు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. 8 గంటల 35 నిమిషాలకు నంద్యాల నుంచి బయల్దేరితే.. మార్కాపూర్‌ రోడ్డు స్టేషన్‌కు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది.


తిరుగు ప్రయాణంలో మార్కాపురం - గుంతకల్లు రైలు (57408) మార్కాపురంలో తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు బయల్దేరుతుంది. నంద్యాలకు ఉదయం 7 గంటల 20 నిమిషాలకు చేరుకుంటుంది. ఐదు నిమిషాల అనంతరం నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరితే.. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు గుంతకల్లు - మార్కాపురం - గుంతకల్లు రైలు.. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచర్ల, పాణ్యం. నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట,గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబొట్ల కృష్ణాపురం, కంబం, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.


మరోవైపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి మేరకు.. రైల్వే శాఖ ఈ ప్యాసింజర్ రైలును ఏర్పాటు చేసింది. మరోవైపు నంద్యాల మీదుగా గుంతకల్లుకు రైళ్లు నడిపించాలని ఈ ప్రాంతవాసులు గత కొంతకాలంగా కోరుతున్నారు. ఈ మార్గంలో నడిచే రైళ్లు.. అన్నీ కూడా రాత్రిపూట నడుస్తాయని.. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉందని ఆమె ఇటీవల రైల్వే శాఖ దృష్టికి తెచ్చారు. పగటి పూట ప్రయాణించేలా మెమో లేదా ప్యాసింజర్ రైలును నడిపించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల మీదుగా.. గుంతకల్లు - మార్కాపురం రోడ్డు స్టేషన్ వరకూ డైలీ ప్యాసింజర్ రైలును రైల్వేశాఖ ప్రవేశపెడుతోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa