ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ..రాబర్ట్ వాద్రా

national |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 08:54 PM

కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీ చేతుల్లో పెట్టాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. పైగా గత కొద్ది కాలంగా దేశంలో జరుగుతున్న ఏ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో నాయకత్వ మార్పు జరగాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోందని.. ప్రియాంక, రాహుల్ గాంధీల మధ్య పార్టీ అధ్యక్ష బాధ్యతలకు సంబంధించిన అంశంపై ఎంతో కాలంగా పోరు నడుస్తోందని ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ భర్త.. రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ప్రధాని కాగలదని అభిప్రాయ పడ్డారు. ఇప్పుడీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


 ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ప్రియాంక చాలా కష్టపడుతుంది. రాజకీయాలు, జీవితం గురించి ఆమె తన నానమ్మ ఇందిరా గాంధీ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంది. ఆమె నిత్యం ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తుంది. రాజకీయాల్లో ఆమెకు చాలా భవిష్యత్తు ఉంది. దేశ ప్రజలు ప్రియాంకలో.. ఆమె నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చూస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధానిగా ప్రియాంక ఉండాలని కోరుకుంటున్నారు.. అందుకు మద్దతిస్తున్నారు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


అదే సందర్భంలో రాబర్ట్ వాద్రా.. రాహుల్ గాంధీ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కూడా ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారని తెలిపారు. ప్రియాంక, రాహుల్ గాంధీ రక్తంలోనే రాజకీయాలు ఉన్నాయన్నారు. దేశం కోసం వారు.. వారికి ఎంతో ప్రియమైన వారిని సైతం కోల్పోయారు అని చెప్పుకొచ్చారు. అలానే తనను కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. కానీ బీజేపీ మాత్రం నెపోటిజమ్ పేరుతో రాజకీయం చేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తోంది అన్నారు.


దేశంలో ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఆ సమయంలో ఈడీ తనపై రైడ్ చేస్తుందన్నారు. భవిష్యత్తులో తన రాజకీయ ఎంట్రీ గురించి ఆలోచిస్తాను అని తెలిపారు. రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వారసత్వ పోరు గురించి చెప్పకనే చెప్పిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఇదిలా ఉంటే.. ప్రియాంక గాంధీకి పార్టీ అప్పగించాలనే వాదన గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించాలని కోరుతూ.. నేరుగా సోనియా గాంధీకే లేఖ రాశారు. ఇక కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీని ప్రధాన మంత్రిని చేస్తే.. తను పాకిస్థాన్‌ భరతం పడుతుందని.. ఆమె ఇందిరా గాంధీ మనవరాలంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందుల్లో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు ఈ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa