ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒడిశాలో కూలిన శిక్షణ విమానం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 10:27 AM

ఒడిశాలో సోమవారం ఉదయం శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతిచెందారు. వీరిలో ఒకరు శిక్షణ పొందుతున్న పైలట్, శిక్షకుడు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కూలిపోయినట్టు వివరించారు. ఇందులో ఒకరు మహిళ పైలట్ అని తెలిపారు. డెంకనాల్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదిక ప్రకారం.. డెంకనాల్ జిల్లాలోని కనకదాహదా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ విమానయాన శిక్షణా సంస్థ (జిఐటిఐ) విమానం శిక్షణ కోసం బయలుదేరింది.


టెకాఫ్ అయిన నిమిషాల్లోనే అది కూలిపోయిందని, అందులోని ట్రెయినీ పైలట్ సహా, సీనియర్ పైలట్ చనిపోయాడని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపంతో లేదా వాతావరణం అనుకూలించక కూలిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. శకలాలను తొలగించి, మృతదేహాలను బయటకు తీశారు.


ప్రమాదం గురించి సమాచారం అందుకున్న డెంకనాల్ ఎస్పీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బిర్సాల్ ఏవియేషన్ అకాడమీలో గతేడాది శిక్షణ ప్రారంభమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 90 మంది ఇక్కడ శిక్షణ పొందుతుండగా.. రోజుకు 36 మందిని శిక్షణ విమానంలో తీసుకెళ్లి నడపడంలో శిక్షణ ఇస్తారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా రెండున్నర నెలల పాటు శిక్షణ నిలిపివేయగా.. ఆంక్షలను సడలించడంతో జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa