ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఆ 11 మంది మృతి కేసు ఇప్పటికీ మిస్టరీనే!

national |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 02:16 PM

దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మూఢనమ్మకాలతోనే వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేసు ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఈ ఘటనపై వారి బంధువులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ వాళ్లంతా విద్యావంతులని, మూఢ నమ్మకాలను పాటించరని అంటున్నారు. దీనిపై మృతురాలు నారాయణ్ దేవి మనవడు కేతన్‌ నాగ్‌పాల్‌ స్పందింస్తూ.. తమ కుటుంబానికి ఆర్థిక సమస్యలేమీ లేవని అలాంటిప్పుడు ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడతారని ప్రశ్నించారు. ఇవి ముమ్మాటికీ హత్యలేనని అతడు అనుమానం వ్యక్తంచేశాడు. వారికి మూఢ విశ్వాసాలపై నమ్మకం లేదని, ఒకవేళ ఆత్మహత్యలు చేసుకుంటే ముఖాన్ని, నోర్లను, చేతులను కట్టేసుకుంటారా అని నిలదీశారు.ఈ ఘటనకు ముందు రోజు రాత్రి మృతులతో తమ కుటుంబసభ్యులు మాట్లాడారు.. ఆ సమయంలో చాలా సాధారణంగా ఉన్నట్టు, వారి మాటల్లో ఎలాంటి ఒత్తిడి కనిపించలేదని మరో బంధువు తెలియజేశారు. అంతేకాదు వారికి ఎవరితోనూ వైరం లేదని, కానీ ఎవరో హత్యచేసి ఉంటారనే అనుమానం ఉంది..వీటికి ఎలాంటి మతపరమైన కారణం లేదని వ్యాఖ్యానించాడు. తమవారికి దేవుడి పట్ల నమ్మకం ఉంది కానీ ప్రాణాలు తీసుకునేంతగా కాదని మరో వ్యక్తి పేర్కొన్నాడు. మూఢనమ్మకాలను విశ్వసించరని, అంతా విద్యావంతులేనని తెలిపారు.బురారి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే మతపరమైన కారణాలు, మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆ ఇంట్లో లభ్యమైన డైరీ, పలు పత్రాల ఆధారంగా పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఒకేసారి ఒకే విధంగా చనిపోతే వారంతా దేవుని దగ్గరికి వెళ్తారని డైరీలో రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల కళ్లకు గంతలు, చేతులు, నోరు కట్టేసి ఉన్నాయి. వీరి మృతదేహాలు ఇంటి పైకప్పుకు వేలాడుతూ కనిపించగా వృద్ధురాలు నారాయణ్‌ దేవి మృతదేహం మాత్రం కిందనే ఉంది. నారాయణ్ దేవి తప్ప మిగితావారి మృతదేహాలు సాధారణంగా ఉండటంతో దీని వెనుక తాంత్రిక పూజల కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వీరిని ఎవరైనా హత్యచేస్తే ఇంట్లో విలువలైన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. మహిళల ఒంటిపై ఉన్న ఆభరణాలు జోలికి కూడా పోలేదు. కాబట్టి ఈ 11మంది ఆత్మహత్యే చేసుకొని ఉంటారనే వాదన వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa