చైనా రాజధాని బీజింగ్ లో మరోసారి కరోనా కలకలం రేపుతోంది.. బీజింగ్ లో ప్రతినిత్యం రద్దీగా ఉండే జింఫాడీ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ కేంద్రంగా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న అనుమానంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బుధవారం కొత్తగా బీజింగ్ లో 30 కరోనా కేసులు నమోదవగా.. అందరూ ఆ మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారేనని తేలింది. దీంతో అధికార యంత్రాంగం నష్ట నివారణ చర్యలను చేపట్టింది. మొత్తం 1255 విమాన సర్వీసులను రద్దు చేసింది. బీజింగ్ పౌరులను.. కొద్ది రోజుల పాటు నగరం దాటి వెళ్లవద్దనీ.. ప్రయాణాలు మానుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం నుంచి బీజింగ్ లో స్కూళ్లు, కాలేజీలను కూడా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
జింఫాడీ హోల్ సేల్ ఫుడ్ మార్కెట్ కు ప్రతి నిత్యం వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మే 30వ తారీఖు వరకు ఈ మార్కెట్ కు 2 లక్షలకు పైగా ప్రజలు వచ్చి ఉంటారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. గడిచిన ఆరు రోజులుగా ఈ ఒక్క నగరంలోనే 137 కొత్త కేసులు నమోదయ్యాయి.. మిగిలిన వారిలో ఎంత మందికి కరోనా సోకింది..? వారు ఎక్కడెక్కడి వారు..? అన్నది తెలుసుకోవడం కష్టం కాబట్టి.. బీజింగ్ లో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లు అధికారులు తేల్చిచెప్పారు. బీజింగ్ నుంచి రాకపోకలను సాధ్యమయినంత మేరకు తగ్గించేందుకు ఏకంగా 70శాతం విమానాలను రద్దు చేశారు. 1255 విమానాలు.. విమానాశ్రయాల్లోనే నిలిచిపోయాయి. నగరంలో కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ట్రావెల్ బ్యాన్ ను కూడా విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజింగ్ ను విడిచి వెళ్లాల్సిన వారికి న్యూక్లిక్ యాసిడ్ టెస్టులు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa